మన శాస్త్రవేత్తలు సత్తా చాటారు, త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. జాతీయ తూనికలు, కొలతల శాఖ సమావేశంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.
Recommended Video
భారత శాస్త్రవేత్తలు సక్సెస్..
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన దేశ శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. మేడిన్ ఇండియా కరోనా టీకాలను తీసుకురావడంలో భారత శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారని ప్రశంసించారు. రెండు స్వదేశీ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. మన ఈ శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని కొనియాడారు.
దేశంలో త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్..
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్లో త్వరలో ప్రారంభం కానుందని మరోసారి స్పష్టం చేశారు. మనం తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం ఎంత ముఖ్యమో.. నాణ్యత కూడా అంతే ముఖ్యమన్నారు. నాణ్యత, విశ్వసనీయత గల ఉత్పత్తులను తీసుకొస్తూ మన బ్రాండ్ ఇండియాను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
టాప్ 50లో భారత్..
మేకిన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభించేలా కృషి చేయాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచ సృజనాత్మక ర్యాంకింగ్స్లో భారత్ టాప్ 50 దేశాల్లో ఒకటిగా ఉందని నరేంద్ర మోడీ తెలిపారు. పరిశ్రమ, సంస్థల మధ్య సహకారం మరింత బలపడుతోందని చెప్పారు. ఈ క్రమంలోనే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.
దేశంలో రెండు వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్
ఈ సందర్భంగా నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్, నిర్దేశక్ ద్రవ్యాలను మోడీ ప్రారంభించారు. కాగా, దేశంలో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్ కూడా దేశ డ్రగ్ రెగ్యూలేటర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్లను హెల్త్ కేర్ సిబ్బంది ముందుగా ఇవ్వనున్నారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత దశలవారీగా అవసరమున్న అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.