కమల్హాసన్ భరోసా: ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి సాయం..
భారతీయుడు-2 సినిమా షూటింగ్ సందర్భంగా క్రేన్ కూలి చనిపోయిన కుటుంబాలకు హీరో కమల్హాసన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుల కుటుంబానికి రూ.కోటి అందజేస్తామని పేర్కొన్నారు. క్రేన్ కూలడంతో శ్రీ కృష్ణ, మధు, చంద్రన్ అనే సాంకేతిక నిపుణులు బుధవారం రాత్రి అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి కమల్ హాసన్ తృటిలో తప్పించుకోగా.. దర్శకుడు శంకర్ కూడా గాయపడ్డారు. గాయపడ్డ ఇతర సిబ్బందికి చికిత్స కొనసాగుతోంది.
క్షతగాత్రులకు పరామర్శ
ఆస్పత్రిలో గాయపడ్డ వారిని కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి అందజేస్తామని.. వారి ప్రాణాలను తీసుకురాలేమని కమల్ హాసన్ పేర్కొన్నారు. తాము అందజేసే నగదుతో ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుందని చెప్పారు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులకు భద్రత డొల్లతనం మరోసారి బయటపడిందని కమల్ హాసన్ పేర్కొన్నారు.
కోట్లు పెట్టి నిర్మించినా..
ప్రమాదంపై తన స్నేహితులతో మాట్లాడనని.. భవిష్యత్లో ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సినిమా స్థాయిని పెంచుకుంటూ.. బడ్జెట్ పెంచి... సినిమా రంగం కూడా ఉన్నతస్థితికి చేరిందని అనుకొంటున్నాం.. కానీ ప్రమాద ఘటనతో డొల్లతనం బయటపడిందన్నారు. సిబ్బందికి భద్రత కల్పించలేనప్పుడు ఎన్ని కోట్లతో సినిమా నిర్మిస్తే.. ఏముంది.. ఘటనతో తనకు సిగ్గేసిందని కమల్ హాసన్ భావోద్వేగంతో ప్రసంగించారు.
ఆర్థిక భరోసా..
అందజేసే నగదుతో ఆర్థిక భరోసా మాత్రమేనని స్పష్టంచేశారు. వారిని తిరిగి తీసుకురాలేమని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగితే కోలుకోవడానికి ఎంత సమయం పడుతోంది.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందో తనకు తెలుసన్నారు. మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదం నుంచి తాను మరిన్ని పాఠాలు నేర్చుకున్నానని తెలియజేశారు.
అప్పుడే ఇలా..
టెక్నీషియన్ శ్రీ కృష్ణ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. సినిమాలో తనకు అసిస్టెంట్గా చేరాడని.. బుధవారమే చేరి.. అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని చెప్పారు. శంకర్ బృందంలో చేరినందుకు గర్వపడ్డాడని గుర్తుచేశారు. ప్రముఖ కార్టూనిస్ట్ మధన్ అల్లుడే శ్రీ కృష్ణ అని కమల్ హాసన్ పేర్కొన్నారు.