కేంద్రం చిటికేస్తే చాలు..సరిహద్దుల్లో సత్తా చాటిన వైమానిక దళం
న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత సరిహద్దుల్లో క్రమంగా యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తోన్న జైషె మహమ్మద్ ఉగ్రవాదులే ఈ దాడికి కారణమని, ఆ దేశంపై మరోసారి యుద్ధానికి దిగాలని అంటూ దేశ ప్రజలు నినదిస్తున్న వేళ.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. మనదేశ వాయుసైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో తన సత్తా చాటింది. వైమానిక దళ విన్యాసాలను నిర్వహించింది. తన అమ్ములపొదిలో ఉన్న కీలక అస్త్రాలను ప్రదర్శించింది. వైమానికదళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఇందులో పాల్గొన్నారు.
140 రకాల యుద్ధ విమానాలతో..
రాజస్థాన్ లోని పోఖ్రాన్ వద్ద పాకిస్తాన్ సరిహద్దుల్లో సుమారు అయిదు గంటల పాటు వైమానిక దళ విన్యాసాలు కొనసాగాయి. వైమానిక దళం ఆధీనంలో ఉన్న 140 రకాల యుద్ధ విమానాలను ఇందులో ప్రదర్శించారు. 137 ఎయిర్ క్రాఫ్టులు, సుఖోయ్-30, మిరాజ్-2000, జాగ్వార్, మిగ్-21, బైసన్ మిగ్-27, మిగ్-29, ఐఎల్ 78, ఎఎన్-32 రకం విమానాలు ఇందులో పాల్గొని, తమ సత్తా చాటాయి. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సహా రక్షణ శాఖకు చెందిన పలువురు కీలక అధికారులు ఈ విన్యాసాలను వీక్షించారు. గౌరవ గ్రూప్ కేప్టెన్గా నియమితుడైన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దీనికి హాజరయ్యారు. అత్యాధునిక తేలిక పాటి హెలికాప్టర్ల రకానికి చెందిన ఆకాశ్ వైమానిక విన్యాసాల్లో తమ సత్తా చాటడం ఇదే తొలిసారి.
కేంద్రం కనుసైగ కోసం ఎదురు చూస్తున్నాం
ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా కొన్ని కీలక వ్యాఖ్యానాలు చేశారు. తాము సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమయ్యామని, కేంద్రం నుంచి సంకేతాలు అందడమే తరువాయి అని ఆయన అన్నారు. తమ శక్తిని చాటడం కోసమే ఈ యుద్ధ విన్యాసాలను చేపట్టామని ధనోవా పునరుద్ఘాటించారు. పగలు, రాత్రి అనే తేడా తమకు లేదని, లక్ష్యం ఎంత కఠినమైనా ఛేదించి తీరుతామని ఆయన అన్నారు. లక్ష్యాన్ని ఛేధించడమే తమ పని అని చెప్పారు. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమయ్యామని తమ శతృదేశానికి తెలియజెప్పడానికే తాము ఈ విన్యాసాలను చేపట్టినట్లు వెల్లడించారు. ఎప్పుడు? ఎలా? ఆరంభించాలనే విషయంపై తమకు పూర్తి స్పష్టత ఉందని, కేంద్రం నుంచి సానుకూల సంకేతాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.
వాటి సత్తా ఇదీ..
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కొన్ని యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజాస్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్), భూమి ఉపరితలంపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగలిగే ఆకాశ్ క్షిపణి, గాలి లో నుంచే, గాలిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలతో ప్రదర్శన చివరి వరకూ ఉత్కంఠతగా సాగింది. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు రాత్రీ, పగలు తేడా లేకుండా లక్ష్యాలను ఛేదించాయి.
ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో ఇదే తొలిసారి..
సరిహద్దుల్లో వైమానిక దళం విన్యాసాలను నిర్వహించడం ఇదే తొలిసారి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దళం ఇంత పెద్ద ఎత్తున విన్యాసాలను చేసిన సందర్భాలు లేవు. తాజాగా నిర్వహించిన ఈ విన్యాసాలు యుద్ధ సంకేతాలను చాటుతున్నాయి. పుల్వామాలో ఉగ్రవాదుల దాడి తరువాత వైమానిక దళం చేపట్టిన ఈ విన్యాసాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పుల్వామా వద్ద చోటు చేసుకున్న ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనపై దేశం మొత్తం కదిలిపోయింది.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించాలని దేశ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. పాకిస్తాన్ పీచమణచాల్సిన సరైన సమయం ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలియజేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు చేయాలనే విషయంపై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఇదివరకే వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైమానిక దళంతన వాయుశక్తిని ప్రదర్శించడం పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపించినట్లయింది.