దాడి అనంతరం భారత వైమానిక దళ పైలెట్ మిస్సింగ్.. ధృవీకరించిన అధికారులు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన పైలెట్ ఒకరు అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ధృవీకరించారు. బుధవారం ఉదయం భారత భూభాగంలోకి పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చొచ్చుకు వచ్చిందని, దీన్ని భారత వాయుసేన అధికారులు నేల కూల్చారని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి రవీష్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పాక్ ఎయిర్ క్రాఫ్ట్ ను నేలకూల్చుతున్న ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో మనదేశ వాయుసేనకు చెందిన మిగ్ 21 బైసన్ ను కోల్పోయామని చెప్పారు. మిగ్ 21 పైలెట్ అదృశ్యం అయ్యారని వివరించారు. మిగ్ 21 పైలెట్ ను తాము బంధించినట్లు పాకిస్తాన్ చెబుతోందని, దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉందని రవీష్ కుమార్ చెప్పారు. భారత వైమానిక దళం నేలకూల్చిన పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు ఆ దేశ భూభాగం మీదే పడ్డాయని అన్నారు.