చైనా వెనకడుగు వేసిన వేళ.. భారత్ దూకుడు: అటాకింగ్ హెలికాప్టర్లు..నైట్ ఆపరేషన్: మిగ్ సహా
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన తన సైన్యాన్ని చైనా ఉపసంహరించుకున్న వేళ.. భారత్ తన దూకుడును కొనసాగిస్తోంది. మరో కీలక అడుగు ముందుకేసింది. చైనా సరిహద్దుల్లో పవర్ఫుల్ హెలికాప్టర్లను మోహరింపజేసింది. దీనికోసం కొత్తగా నైట్ ఆపరేషన్లను ప్రారంభించింది. లఢక్ సరిహద్దుల్లో వైమానిక దళానికి ఇప్పటిదాకా నైట్ ఆపరేషన్ల సౌకర్యం లేదు. తాజాగా దీన్ని చేపట్టింది. శక్తిమంతమైన హెలికాప్టర్లను సరిహద్దులకు తరలించింది. అత్యంత కీలకమైన, అత్యాధునికమై హెలికాప్టర్లను మోహరింపజేసింది.
భారత్ దారి చూపింది.. అమెరికా అనుసరించబోతోంది: టిక్టాక్ సహా అన్ని చైనా యాప్లపై బ్యాన్
భారత్ వైమానిక దళానికి చెందిన కీలక హెలికాప్టర్లను చైనా సరిహద్దులకు తరలించింది భారత్. మిగ్-29, అపాచీ అటాకింగ్ హెలికాప్టర్లను అక్కడ మోహరింపజేసింది. భారీ వస్తువులను ఎంతదూరమైనా తరలించే శక్తి సామర్థ్యాలు ఉన్న చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా తరలించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు ఆయా హెలికాప్టర్లన్నీ లఢక్లో ల్యాండ్ అయ్యాయి. ఫార్వర్డ్ ఎయిర్బేస్ల నుంచి తమ కార్యకలాపాలను ఆరంభించాయి.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీలుగా చైనా సరిహద్దుల్లో నైట్ ఆపరేషన్లను ప్రారంభించినట్లు ఫార్వర్డ్ ఎయిర్బేస్ సీనియర్ ఫైటర్ పైలెట్ గ్రూప్ కేప్టెన్ ఏ రథీ తెలిపారు. సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా దాన్ని ధీటుగా ఎదుర్కొనడానికే ఈ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలు, ఉత్సాహవంతులైన పైలెట్లను ఫార్వర్డ్ ఎయిర్బేస్లో మోహరింపజేశామని అన్నారు.
చైనాతో సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని హెలికాప్టర్లను రప్పించామని, నైట్ ఆపరేషన్లను ప్రారంభించామని రథీ వివరించారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద మోహరింపజేసిన సైనికులను చైనా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల వరకు వెనక్కి వెళ్లాయి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు. వివాదాస్పద భూభాగంలో నిర్మించిన తాత్కాలిక శిబిరాలను కూడా తొలగించింది.
Recommended Video
యుద్ధ సామాగ్రిని సైతం వెనక్కి తరలించింది. వ్యూహాత్మకంగా, సమస్యాత్మంగా మారిన ఫోర్ ఫింగర్స్, గోగ్రా పోస్ట్, హాట్ స్పింగ్, గాల్వన్ వ్యాలీని దాదాపుగా ఖాళీ చేసింది. అదే సమయంలో భారత్ దూకుడుగా వ్యవహరించడం, నైట్ ఆపరేషన్లు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జోక్యం చేసుకోవడం, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్యీతో టెలిఫోన్లో సంభాషించిన తరువాతే చైనా వెనక్కి తగ్గిందంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.