కుప్పకూలిన వైమానిక దళ ఎయిర్క్రాఫ్ట్: నేలకూలిన చోట..!
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. సాంకేతిక కారణాల వల్లే ఈ ఘటన సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో శిక్షణలో ఉన్న పైలెట్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స కోసం పైలెట్ను ఆసుపత్రికి తరలించారు. పైలెట్కు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.
వైమానిక దళానికి చెందిన మిరేజ్-2000 శిక్షణా ఎయిర్క్రాఫ్ట్ అది. ఇక్కడి బేస్ స్టేషన్లో వైమానిక దళ పైలెట్లకు శిక్షణ ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఈ ఉదయం బేస్ స్టేషన్ నుంచి బయలుదేరింది. పైలెట్ అభిలాష్ ఆ సమయంలో శిక్షణ పొందుతున్నారు. భిండ్కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్కాబాద్ గగనతలం మీదుగా వెళ్తోన్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి.
దీనితో ఎయిర్క్రాఫ్ట్ అదుపు తప్పింది. కుప్పకూలే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన పైలెట్ పారాశూట్ సహాయంతో కిందికి దూకారు. పొగలు కక్కుతూ ఆ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ మన్కాబాద్ పొలాల్లో నేలకూలింది. ఈ సమయంలో చెవులు చిల్లులు పడే శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ వెంటనే తునాతునకలైందని చెప్పారు. ఎయిర్క్రాఫ్ట్ నేలకూలిన చోట భారీగా గొయ్యి ఏర్పడింది. విమానం ముక్కలు ముక్కలైంది. దాని శకలాలు కొన్ని మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి.
దీన్నంతటినీ స్థానికులు తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. పైలెట్ అభిలాష్ సురక్షితంగా పారాశూట్ నుంచి కిందికి దూకడం కనిపించింది. కొన్ని మీటర్ల ఎత్తు నుంచి ఆయన కిందపడటంతో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే భిండ్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్లో పైలెట్ అభిలాష్ను భిండ్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్లు చెబుతున్నారు.
కాగా- ఈ సంఘటనను వైమానిక దళ అధికారులు నిర్ధారించారు. భిండ్ జిల్లాలోని మన్కాబాద్ వద్ద మిరేజ్-2000 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలినట్లు తెలిపారు. పైలెట్ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక అందిన తరువాత అసలు కారణాన్ని వెల్లడిస్తామని చెప్పారు.