ఇరాన్ వైపు వెళ్లొద్దు: ఇండియన్ ఎయిర్ లైన్స్కు ఆదేశాలు: అమెరికా వైమానిక దాడులతో ఉద్రిక్తత!
Recommended Video
న్యూఢిల్లీ: ఇరాక్ పై అమెరికా వైమానిక దాడుల అనంతరం మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలు సాగించవద్దంటూ ఇండియన్ ఎయిర్ లైన్స్ కు యంత్రాంగాన్ని సూచించింది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రోగ్ అడ్వెంచరిజమ్: అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా: కయ్యానికి సై: ఇరాన్..!
ఇరాన్ సైనికాధిపతి ఖాసిం సోలేమనిని లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం నిర్వహించిన దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో గల అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఖాసిం సోలేమనిపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఖాసింతో పాటు ఇరాకీ మిలీషియా కమాండర్ అబు మెహదీ అల్ ముహండీస్ మరణించారు. ఈ దాడుల ఘటన తరువాత మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఖాసిం సోలేమనిపై దాడి చేసి, హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. అమెరికా రాయబార కార్యాలయానికి ప్రాతినిథ్యవ వహిస్తోన్న స్విట్జర్లాండ్ హైకమిషనర్ కు సమన్లను జారీ చేసింది. ఇలాంటి వాతావరణంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలు సాగించడాన్ని నివారించాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిస్తూ డీజీసీఏ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల వైపు వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు చాలామటుకు మధ్య తూర్పు దేశాల గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. ఈ మార్గంలో ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలనలోకి తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.