పాకిస్తాన్ వల్లే నష్టాల్లో భారత విమానాయాన రంగం
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాకు ఈ మధ్యకాలంలో బాగా నష్టం వాటిల్లింది. ఇందుకు కారణం పాకిస్తాన్ అని అధికారులు చెబుతున్నారు. అసలు ఎయిరిండియా నష్టాల బాట పట్టడానికి పాకిస్తాన్కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
నష్టాలకు కారణం పాకిస్తానేనా..?
ఢిల్లీ ఎయిరిండియా కార్యాలయంలో అధికారులు చెమటలు కక్కుతున్నారు. ఇందుకు కారణం అక్కడి ఎండలు కాదు. ఎయిరిండియా విమానాయాన సంస్థ తీవ్ర నష్టాల్లో పయనిస్తోందట. నష్టాల బాట పట్టడానికి కారణం ఏంటని తలలు పట్టుకున్నారు. ఏంటని సుదీర్ఘంగా ఆలోచించగా ఎయిరిండియా నష్టాల్లో పయనించేందుకు కారణం పాకిస్తాన్ అని తేల్చారు. అవును ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ తన గగనతలంను మూసివేసింది. దీనికి తోడు ఆయిల్ కంపెనీలు ఆయిల్ ధరలను విపరీతంగా పెంచేశాయి. ఇక పాక్ తన గగనతలం మూసివేయడంతో చాలావరకు విమానాలు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో దూరం పెరిగిపోయింది. ఆ సమయంలో ఇంధనం కూడా ఎక్కువగా ఖర్చు అవడంతో విమానాయాన సంస్థ కాస్త నష్టాల బాట పట్టింది.
కిలో లీటరుకు 700 డాలర్లు ఖర్చు
ఇక మే నెలలో ఇందనం ధరలు 2.5శాతం ఎక్కువగా పెరిగాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులకు కిలో లీటరు ధర 700 డాలర్లు ఖర్చుకానుంది. ఇది గత నెలలో 668 డాలర్లుగా ఉన్నింది. ఇక పాకిస్తాన్ గగనతలం మే 15 వరకు మూసే ఉంటుందనే సమాచారం ఉంది. దీంతో విమాన సర్వీసులకు నష్టాలు తప్పడం లేదు. పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో రోజుకు దాదాపు 400 విమానసర్వీసులపై ఆ ప్రభావం పడుతోంది. ఇందులో చాలా విమాన సర్వీసులు ఓమన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుండగా ...ఇరాన్ గగనతలం మీదుగా సాధారణం కంటే 100 విమానాలు ఎక్కువగా ఎగురుతున్నాయి. పాశ్చాత్యదేశాలకు వెళ్లాలంటే కొన్ని విమానాలు ఢిల్లీ గగనతలం మీదుగా వెళ్లకుండా ముంబై గగనతలం మీదుగా వెళుతున్నాయని దీంతో దూరం పెరిగిపోతోందని అధికారులు చెబుతున్నారు.
నాన్స్టాప్ విమానాలు కూడా ఇంధనం కోసం ఆగుతున్నాయి
ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లే నాన్స్టాప్ విమానాలు పెరిగిన దూరం కారణంగా మధ్యలో ఆగి ఇంధనం నింపుకుంటున్నాయి. దీంతో చేరాల్సిన గమ్యస్థానంకు సాధారణ సమయం కంటే మూడు గంటలు అధికంగా తీసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే ఇండిగో విమానం అహ్మదాబాదు, దోహా విమానాశ్రయాల్లో ల్యాండ్ అయి ఇంధనం నింపుకుని ఆ తర్వాత బయలుదేరుతున్నాయి. ఇక ఎయిరిండియా ముంబై అహ్మదాబాదు మీదుగా అరేబియన్ సముద్రం పై ప్రయాణించి మస్కట్కు చేరుకుంటున్నాయి. ఇక సింగపూర్ ఎయిర్లైన్స్, ఫిన్నేర్, బ్రిటీష్ ఎయిర్వేస్, ఏరోఫ్లోట్, థాయ్ ఎయిర్వేస్లాంటి పలు అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో పయనిస్తున్నట్లు సమాచారం.
నష్టాలు చూస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు
పాకిస్తాన్ గగనతలం తెరిచేలోగా ఎయిరిండియా సంస్థకు 100 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే రూ.372 కోట్ల మేరా నష్టాలు వచ్చాయి. అంటే రోజుకు 6 కోట్లు నష్టాలు వచ్చాయి. ఇక ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ఒక్క ప్రయాణానికి 2500 నుంచి 3000 కిలోల ఇంధనం ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక పాక్ గగనతలం మూసివేసిన నాటి నుంచి స్పైస్ జెట్ విమానాయాన సంస్థ ఢిల్లీ కాబుల్ విమాన సర్వీసులు కూడా నిలిపివేయడం జరిగింది.