హెల్త్కేర్ ఫ్రాడ్: భారతీయ దంపతులకి రూ.51 కోట్ల పైన్
వాషింగ్టన్: న్యూజెర్సీలో మొబైల్ డయాగ్నిక్ సెంటర్ను నడుపుతున్న ఓ భారతీయ జంటకు అమెరికా న్యాయస్థానం 7.75 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. అంటే, రూ.51 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. హెల్త్ కేర్ మోసానికి సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది.
కీర్తిష్ ఎన్ పటేల్ (53), నీతా కె పటేల్(53)లు ఇద్దరు కూడా ఇంతకుముందే హెల్త్ కేర్ మోసానికి సంబంధించి నిందితులుగా కోర్టు తేల్చింది. ఇప్పుడు వారికి జరిమానా విధించింది.
వీరిద్దరు న్యూజెర్సీలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం నడిపిస్తున్నారు. తప్పుడు ఆరోగ్య నివేదికలు ఇచ్చారని, వైద్యల సంతకాలు ఫోర్జరీ చేశారని కోర్టులో రుజువైంది. తాము మోసం చేశామని దంపతులైన వీరిద్దరు కూడా అంగీకరించారు.
అక్టోబర్ 2008 నుంచి జూన్ 2014 వరకు వీరు ఇచ్చిన నివేదికల్లో సగానికి పైగా ఏ వైద్యునితోను మళ్లీ పరిశీలింప చేయలేదు. అమెరికా ప్రభుత్వ బీమా కంపెనీ అయిన మెడికేర్తో పాటడు పలు ప్రయివేటు బీమా కంపెనీల నుంచి 43,86,133.75 డాలర్లు వీరు పొందారు.
వ్యక్తిగత అవసరాలకు, పలు ఇళ్ల కొనుగోలుకు, విలాసవంతమైన వాహనాల కొనుగోలుకు వీరు వాటిని ఉపయోగించారు. లైసెన్స్ లేకపోయినా కొన్నింటిలో నివేదికలు రూపొందించారు. వైద్యుల సంతకాలు ఫోర్జరీ చేయడంలో భర్త కీర్తీష్కు భార్య నీతా సహకరించారు. వీరి మోసాలను ఓ వ్యక్తి వెలుగులోకి తెచ్చాడు. అమెరికా చట్టాల ప్రకారం జరిమానాలో 25 నుంచి 30 సాతం అతనికి ప్రభుత్వం చెల్లిస్తుంది.