అమెరికాలో మరో భారతీయ అమెరికన్ అనుమానాస్పద మృతి
అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ కు చెందిన ఓ అమ్మాయిపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇది ఇలా ఉండగా, ఓ ప్రవాస భారతీయుడు అనుమానాస్ప
న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ కు చెందిన ఓ అమ్మాయిపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇది ఇలా ఉండగా, ఓ ప్రవాస భారతీయుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే అతడి కుటుంబసభ్యులు మాత్రం ఇది తమ కుటుంబ వ్యక్తిగత అంశమని స్పష్టంచేశారు. న్యూజెర్సీలో గతవారం 29ఏళ్ల భారతీయ అమెరికన్ మృతదేహం లభ్యమైంది. అతడి మరణానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందలేదు. కాగా, అమెరికాలో వరుసగా భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఘటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడి తండ్రి మసాచుసెట్స్లో ఉంటున్నారని, ఆయనతో భారత కాన్సులేట్ అధికారులు మాట్లాడారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ఇది వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషాదమని ఆయన తెలిపారని స్పష్టంచేశారు. అలాగే తమ కుటుంబానికి ప్రైవసీ కావాలని కోరారని వెల్లడించారు.
కాగా, ఇటీవల దుండగుల కాల్పుల్లో వంశీ, శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీశ్ పటేల్ అమెరికాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. తాజాగా మరో భారత అమ్మాయిపై కాల్పులు జరిగాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, జరిగిన ఈ ఘటనలన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.