పాకిస్తాన్ తెంపరితనం: ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే.. డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లను జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై విచ్చలవిడిగా ఏర్పాటైన ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు, శిబిరాలను భారత జవాన్లు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. గౌరవ్ అహ్లువాలియాకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లను జారీ చేసింది. ఆర్మీ కాల్పులకు సహేతుక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
12 రోజులుగా హోటల్ లో బస..తెల్లారే సరికి నిర్జీవంగా..సొంత గ్రామానికి సమీపంలో!
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీఓకే) భూభాగంపై ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకున్నారని, శిక్షణా శిబిరాలను నెలకొల్పినట్లు ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి పక్కా సమాచారం భారత సైన్యానికి అందింది. పీఓకే భూభాగంలోని జురా, కుందల్ షాహీ, ఆఠ్ముగాం ప్రాంతాల్లో లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. ఈ మూడు ప్రాంతాలు కూడా వాస్తవాధీన రేఖకు సమీపంలోని నీలం వ్యాలీలో ఉంటాయి. దీనితో వాటిని ధ్వంసం చేయాలని జవాన్లు నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.
ఆదివారం ఉదయం కుప్వారా సెక్టార్ లోని తంగ్ధర్ వద్ద ఫిరంగులతో భారీగా కాల్పులు చేపట్టారు. ఈ కాల్పల ఘటనలో నాలుగు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. మరి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారత సరిహద్దు జవాన్లు నిర్వహించిన ఈ దాడుల్లో నలుగురు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరి కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం అక్కసును వ్యక్తం చేసింది. అకారణంగా, ఎలాంటి కవ్వింపు చర్యలు కూడా లేకుండా, తమ దేశ సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం కాల్పులకు తెగబడిందని ఆరోపించింది.
ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లను జారీ చేశారు. కాల్పులకు గల సమగ్ర కారణాలను వివరించాలని సూచించారు. ఆయనకు సమన్లను జారీ చేయడం ద్వారా అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం తన నిరసనను వ్యక్తం చేసినట్టయింది. సరిహద్దుల్లో వెలిసిన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్యల వల్ల ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనే సంకేతాన్ని ఇచ్చినట్టయిందని అంటున్నారు.
తాము నిర్వహించిన ఎదురు కాల్పుల్లో భారత్ కు చెందిన తొమ్మిది మంది జవాన్లు మరణించారని పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ వెల్లడించారు. తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ కాల్పులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. భారత ఆర్మీ చేపట్టిన కాల్పుల్లో అయిదుమంది అమాయక పౌరులు మరణించారని అన్నారు. ఆ దాడులను తాము తిప్పి కొట్టామని, ఈ ఘటనలో తొమ్మిది మంది భారత జవాన్లు మరణించారని అన్నారు. భారత మీడియా ఈ ఘటనను వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. ఈ కాల్పుల ఉదంతంపై ఆయన వరుసగా ట్వీట్లను సంధించారు.