ఇవాళ్టి హీరోలు వీళ్లే.. లలిత, అమన్దీప్కు నీరాజనం.. మీరూ మెచ్చుకుంటారు..
ఖాళీగా కుర్చున్నాసరే కర్తవ్యం గురించే ఆలోచించేవాడు నిజమైన సైనికుడు. పర్సనల్ పనిలో ఉన్నా ప్రజల కోసం అన్నీ పక్కనపెట్టేసి పరుగున వచ్చేసే తత్వం మన ఆర్మీది. సాయుధ బలగాల ప్రతిష్టను మరింత పెంచుతూ ఇద్దరు మహిళా కెప్టెన్లు చేసిన పనిని దేశం మెచ్చుకుంటున్నది. ఇవాళ్టి నిజమైన హీరోలు మీరేనంటూ కెప్టెన్ లలిత, కెప్టెన్ అమన్దీప్ లకు నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఏం చేశారంటే..
విపత్కర పరిస్థితిలో..
మొన్నటి రాత్రి.. అహ్మదాబాద్-కోల్ కతా మధ్య నడిచే ‘హౌరా ఎక్స్ ప్రెస్' రైలు వేగంగా దూసుకుపోతోంది.. అప్పటికే ప్రయాణికులందరూ నిద్రలోకి జారుకున్నారు. వాళ్లలో ఓ గర్భిణికి సడెన్ గా నొప్పులు మొదలయ్యాయి. నెలలు నిండకముందే ఇలా జరుగుతోందేంటాని ఆమె కంగారుపడింది. ఇంకో గంట ప్రయాణిస్తేగానీ తర్వాతి స్టేషన్ రాదు.. వచ్చినా అక్కడ వైద్యసౌకర్యం ఉంటుందో లేదోననే కంగారు. నిమిషనిమిషానికీ నొప్పులు పెరిగాయి. అంతలోనే ఇద్దరు లేడీ ఆర్మీ ఆఫీసర్లు ఎంట్రీ ఇచ్చారు.
సమయస్ఫూర్తి..
ఆర్మీ కెప్టెన్లయిన లలిత, అమన్దీప్.. గుర్దాస్ పూర్ లోని 172వ మిలిట్రీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. పనిమీద ఊరెళుతూ హౌరా ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఈ ఇద్దరు.. ఆ గర్భిణి పాలిటి దేవతలయ్యారు. చకచకా ఏర్పాట్లు చేసి.. జాగ్రత్తగా పురుడుపోసి, తల్లీబిడ్డల ప్రాణాల్ని కాపాడారు. లలిత, అమన్దీప్ ప్రదర్శించిన సమయస్ఫూర్తితో పెద్ద విషాదం తప్పినట్లైంది.
అభినందనల వెల్లువ..
కెప్టెన్ లలిత, అమన్దీప్ చేసిన పనిని ఇండియన్ ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్( ఏడీజీ పీఐ- ఇండియన్ ఆర్మీ) ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశానికే మొదటి ప్రాధాన్యం అని, ప్రజల్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని అర్థం వచ్చేలా హ్యాష్ ట్యాగ్ పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వేలకొద్దీ రీ ట్వీట్లు, కామెట్లు వచ్చాయి. తల్లీబిడ్డల ప్రాణాల్ని కాపాడిన లేడీ ఆఫీసర్లకు అభినందనలు వెల్లువెత్తాయి. రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా ఇద్దరు కెప్టెన్లను ప్రశంసించారు.