ఉగ్రదాడి: సైనికులకే వదిలేయాలి, ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి జరిగిన ఘటనపై భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్ ఆలస్యం అయ్యిందని వస్తున్న ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.
ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాల మధ్య పూర్తి సహకారం ఉందని సింగ్ తెలిపారు. ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా చూడటానికి కొంత సమయం తీసుకున్నామని వివరించారు. అందు వలనే ఉగ్రవాదులను ఏరివేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని ఆరోపణలు వచ్చాయని అన్నారు.
ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కి ఉండటం వలన వారిని బయటకు రప్పించాల్సి రావడం, అదే సమయంలో ప్రాణ నష్టం జరకుండా ఆపరేషన్ పూర్తి చేయడానికి ప్రధాన్యతనివ్వడం మూలంగా కొంత సమయం పట్టిందని వివరించారు.
ఉగ్రవాదుల ఏరివేతకు ఎంత సమయం తీసుకుంటారనే విషయం యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికులకే వదిలేయాలని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ స్పష్టం చేశారు. నిఘా వర్గాల వైఫల్యం వలనే ఉగ్రదాడి జరిగిందన్న విమర్శలపై సింగ్ స్పందించారు.
ఇంటిలిజెన్స్ వర్గాలకు చిక్కకుండా ఉగ్రవాదులు ఎలా వచ్చారనే విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారణ జరుపుతున్నారని చెప్పారు. ఈ పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటన మనం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతోందని దల్బీర్ సింగ్ వివరించారు.