సమయం లేదు మిత్రమా..శరణమా రణమా: సరిహద్దులో భారత యుద్ధ ట్యాంకర్లు..సంకేతమేంటి..?
భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందా..? డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు దిగుతోందా..? భారత్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకర్లను మోహరించడం వెనక ఆంతర్యం ఏమిటి..? ఇప్పటికే చైనా యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం నెక్ట్స్ ఏం చేయబోతోంది..?
Recommended Video
చైనాకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం
ఓ వైపు శాంతి చర్చల ద్వారానే చైనాతో సరిహద్దు సమస్య పరిష్కరించుకోవాలని భావిస్తున్న భారత్... మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. చర్చలు జరుగుతున్న వేళ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నాలు చేయడం వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా తమ బలగాలను ఇతర మిలటరీ వ్యవస్థలను మోహరించడం చేస్తోంది. డ్రాగన్ కంట్రీ కుట్రను పసిగట్టిన భారత్ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. ముందుగా శాంతి మంత్రంను పాటించాలని భావిస్తున్న భారత్.. పరిస్థితుల్లో తేడా వస్తే యుద్ధానికి కూడా వెనకాడబోమనే సంకేతాలు కూడా పంపుతోంది. ఇందులో భాగంగానే భారత ఆర్మీ ఆరు యుద్ధ ట్యాంకర్లను సరిహద్దుల్లో మోహరించింది. గాల్వాన్ వ్యాలీలో T-90 క్షిపణి ట్యాంకర్లను మోహరించింది.
సరిహద్దులో భీష్మా ట్యాంకర్ల మోహరింపు
ఇక సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ బలగాలను పెంచడంతో ఆర్మీ T-90 భీష్మా ట్యాంకర్లను మోహరించింది. గాల్వాన్ నదీ తీరంలో చైనా గుడారాలు, మిలటరీ బలగాలు ఇతర మిలటరీ సామగ్రిని మోహరించింది. తూర్పు లడఖ్లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట యుద్ధ వాహనాలను భారత్ మోహరించింది. అంతేకాదు స్పాంగూర్ గ్యాప్ ద్వారా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న చైనాను అడ్డుకునేందుకు వారి ప్రణాళికలను దెబ్బతీసేందుకు చుషుల్ సెక్టార్లో రెండు ట్యాంక్ రెజిమెంట్లను భారత్ మోహరించింది. ఈ సెక్టార్ పైనే కన్నేసిన డ్రాగన్ కంట్రీ... చర్చల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అప్పగించాలని భారత్ను కోరి ఆ పై తన బలగాలను వెనక్కు రప్పించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. అయితే తమ భూభాగం నుంచి ఒక్క ఇంచి నేల కూడా శతృదేశానికి వెళ్లనివ్వమని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎత్తయిన ప్రాంతాల్లో భారత జవాన్లకు అనుభవం
ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ అన్ని విధాల సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీకి మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు అక్కడికి మార్షల్ ఆర్ట్స్ నిపుణులను పంపింది చైనా. అయితే చైనా ఎన్నిచేసిన భారత జవాన్లను ఏమీ చేయలేదనే ధీమా భారత ఆర్మీ వ్యక్తం చేస్తోంది. సాధారణంగా భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో చైనా బలగాలు రెండేళ్ల పాటు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత కొత్త బలగాలు వస్తాయి. అయితే భారత్ విషయంలో అలా కాదు. 17 ఏళ్ల పాటు బలగాలు అక్కడ మోహరించి ఉంటాయి కాబట్టి జవాన్లు ఆ వాతావరణంకు అలవాటు పడిపోయి ఉంటారని భారత్ చెబుతోంది. అంతేకాదు 1984 నుంచి భారత బలగాలు ఎత్తైన ప్రాంతాల్లో ఎలా ఉండాలో అక్కడి పరిస్థితులపై శిక్షణ కూడా తీసుకోవడం జరుగుతోంది. సియాచిన్ గ్లేసియర్ను తనలో కలిపేసుకునేందుకు 1984లో పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నం చేసి భారత్ దెబ్బకు వెనకడుగు వేసింది. ఇక కార్గిల్ ప్రాంతం కూడా 15000 అడుగుల ఎత్తులో ఉంది. నాడు కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ విజయం సాధించిందని భారత ఆర్మీ గుర్తు చేస్తోంది.
తమ ఫైటర్ జెట్లను మోహరించిన చైనా ఆర్మీ
భారత భూభాగంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించిన శతృదేశాలకు భారత్ ఎన్నో సార్లు ధీటైన జవాబు చెప్పిన అనుభవం ఉంది. ప్రస్తుతం చైనాకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెబుతామని అందుకు సైన్యం సన్నద్ధంగా ఉందని భారత ఆర్మీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎయిర్ఫోర్స్ నేవీలు కూడా ప్రకటించాయి. చైనాకు చెందిన పీఎల్ఏ ఎయిర్ఫోర్స్ ఫైటర్లు ఇప్పటికే తక్లామకాన్ ఎడారిలోని హోటాన్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకుంటున్నాయి. ఇది వాస్తవాధీన రేఖకు 240 కిలో మీటర్ల దూరంలో ఉంది. మొత్తానికి చైనా ఏమాత్రం తోక జాడించి భారత్ వైపు దూసుకొచ్చినా తరిమి కొట్టేందుకు సరిహద్దుల్లో భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయనే అంశం స్పష్టమవుతోంది.