పాక్కి షాక్: పీఓకేలోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిన ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: ఓ వైపు మనదేశంలోకి ఉగ్రవాదులను పంపిస్తూ.. మరో వైపు సరిహద్దులో తరచూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్కు భారత సైనికులు మరోసారి తగిన గుణపాఠం చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పాక్ టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను, శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది.
పాకిస్థాన్ సైనికుల శిబిరాలకు చేరువగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. లీపా వ్యాలీలోని ఉగ్ర శిబిరాలనూ ధ్వంసం చేసింది. కాగా, పాకిస్థాన్ సైన్యం భారత్లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతుండటం గమనార్హం.
జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, లాంటి ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను నడుపుతున్నాయి. వీటికి పాకిస్థాన్ సైన్యమే పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది.
భారత్లోకి చొరబాట్లను ప్రోత్సహించడంతోపాటు మనదేశంలో ఉగ్రదాడులు ఎలా చేయాలో ఇక్కడ ఉగ్ర సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. ఇప్పటికే జలమార్గం గుండా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో దేశంలోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.