‘భారత సైనికులను అదుపులోకి తీసుకున్న చైనా దళాలు’: ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో తమ బలగాలను చైనా సైన్యం అదుపులోకి తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.
సరిహద్దులు భారత సైనికులను ఎవరినీ కూడా బంధించలేదు. చైనా అధికారులు భారత సైనికులను బంధించారంటూ పలు మీడియా ఛానళ్లు వార్తలను ప్రసారం చేయడం సరికాదని భారత సైన్యం తన అధికారిక ప్రకటlలో స్పష్టం చేసింది.
లడఖ్ ప్రాంతంలో ఇటీవల చైనా సైనికులు, మన దేశ సైనికుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత సరిహద్దు వైపునకు చైనా దళాలు వస్తుండటంతో భారత సైన్యం కూడా సరిహద్దుల వెంబడి భద్రతా దళాలను భారీగా పెంచింది.
Recommended Video
కాగా, సరిహద్దు ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొందనే సమాచారంతో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే గత శుక్రవారం పర్యటించారు. సరిహద్దు ప్రాంతంలో అహర్నిశలు నిఘావేసి ఉంచామని, ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా దళాలను మన ప్రాంతంలోకి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు.
చైనా దళాలు దొంగతనంగా మన సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భారత భద్రతా దళాలు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చైనా, భారత దళాల మధ్య తోపులాటలు లాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.