మళ్లీ తెగబడ్డ చైనా: భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు విఫలయత్నం.. రాళ్లదాడి!
జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
లడఖ్: స్వాతంత్ర్య దినోత్స వేళ చైనా మరోసారి తన దుందుడుకు వైఖరిని బయటపెట్టుకుంది. చైనా సైన్యం మరోసారి భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు విఫలయత్నం చేసింది. జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
చైనా సైన్యం పాల్పడిన ఈ దుశ్చర్యకు భారత్ ధీటుగా బదులిచ్చింది. భారత జవాన్లు వారిని సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో చైనా సైనికులంతా మానవ హారంగా ఏర్పడి భారత సైనికులపై రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కొంతమంది సైనికాధికారులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
కాగా, టిబెట్ నుంచి భారత్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని మూడింట రెండు వంతుల భాగాన్ని చైనా నియంత్రిస్తూ వస్తోంది. దీనికి ఆనుకుని భారత్ వైపు ఉన్న ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతాలను కూడా ఆక్రమించాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం 6గం.9గం. మధ్యలో చైనా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు తెరపడినట్లుగా సైనికాధికారులు వెల్లడించారు.