సెక్యులరిజమే ఆర్మీ బలం.. శత్రువుల హక్కుల్నీ కాపాడుతాం.. మరోసారి రావత్ సంచలన వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. 24 గంటలు తిరక్కముందే ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి రాజకీయాల జోలికి పోకుండా పూర్తిగా ఆర్మీ గురించే మాట్లాడారు. మానవ హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ప్రపంచంలోని ఇతరదేశాల సాయుధ బలగాలకంటే 'ఇండియన్ ఆర్మీ'నే ముందుంటుందని చెప్పారు.
కీలక సదస్సు..
శుక్రవారం ఢిల్లీలోని అధికార్ భవన్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆధ్వర్యంలో ‘‘యుద్ధసమయంలో, యుద్ధఖైదీల విషయంలో మానవహక్కులు‘‘ అనే అంశంపై సదస్సు జరిగింది. వక్తగా సదస్సుకు హాజరైన బిపిన్ రావత్.. ఇండియన్ ఆర్మీ మూల సిద్ధాంతాలు, పనితీరు, హక్కుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలను వివరించారు.
ఇండియన్ ఆర్మీ బలమిదే..
ఇండియన్ ఆర్మీ ప్రధానంగా రెండు ప్రధాన సిద్ధాంతాలను విశ్వసిస్తూ, వాటినే ఆచరిస్తుంది. ఒకటి హ్యుమానిటీ(ఇన్సానియత్). రెండోది డీసెన్సీ(షరాఫత్). పూర్తిగా సెక్యులరిస్టు భావనలైన ఈ రెండు అంశాలే ఆర్మీకి అసలైన బలం. భారతపౌరుల మానవహక్కులకు ఆర్మీ గౌరవిస్తుంది. అంతేకాదు, చేతికిచిక్కిన శత్రువుల మానవహక్కుల పట్లా కన్సర్న్ చూపిస్తుంది''అని రావత్ తెలిపారు.
రావత్ పై రాజకీయాలొద్దు: కేంద్ర మంత్రి వీకే సింగ్
ప్రజల్ని తప్పుడు దారిలో నడిపించేవాళ్లు నాయకులు కాబోరంటూ సీఏఏ వ్యతిరేక నిరసనలపై ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ రావత్ ను తప్పుపట్టగా, అధికార బీజేపీ మాత్రం ఆయన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రావత్ వ్యాఖ్యల్లోని అర్థాన్ని చూడాలేతప్ప, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని సూచించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం ప్రతిపక్షపార్టీలకు అలవాటైందని సింగ్ మండిపడ్డారు.