ఆర్మీ మేజర్కు భార్య ఘన స్వాగతం: ఉద్వేగభరిత సన్నివేశం(వీడియో)
న్యూఢిల్లీ: ఆయన భారత ఆర్మీ మేజర్. ఉగ్రవాదులతో పోరాడి ముగ్గురు మట్టుబెట్టారు కూడా. పలుమార్లు చావు అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాడు. కాగా, ఆ ఆర్మీ మేజర్ తిరిగి ఇంటికి వస్తున్నాడని తెలిసి అతని భార్య ఎంతో సంతోషించింది. ఆయన ఘన స్వాగతం పలకాలని భావించింది. విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఆశ్చర్యకరమైన రీతిలో స్వాగతం పలిగింది. దీంతో భావోద్వేగానికి గురైన ఆర్మీ మేజర్ తన భార్యను గుండెలకు హత్తుకున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఆర్మీలో మేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివేష్ తివారీ అనంత్నాగ్లో42వ బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ఇతను గతంలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాడు. రెండు సార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చాడు. అలా కొన్ని నెలల పాటు భార్యకి, తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ దేశం కోసం సేవలందిస్తున్నాడు.
2017లో భారత ప్రభుత్వం ఆయన్ని సేనా మెడల్తో సత్కరించింది. ఇప్పుడు ఆయనకి సెలవులు దొరకడంతో దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం భార్యకి చెప్పడంతో ఆమె తన భర్త కోసం ఘనంగా స్వాగతం చెప్పాలనుకుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్లో ఇద్దరు యువకుల చేత 'రంగ్ దే బసంతి' పాటకు డ్యాన్స్ చేయిస్తూ ప్లకార్డులతో ఘన స్వాగతం పలికింది.
ఆమె పట్టుకున్న ప్లకార్డుల్లో 'అతని కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. బూట్లు నల్లగా ఉంటాయి. అందరూ పక్కకు తప్పుకోండి. నా భర్త వస్తున్నారు' అని రాసుంది. అది చూడగానే శివేష్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోనయ్యారు.
తన రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తన భార్యను ప్రేమతో గుండెలకు హత్తుకున్నాడు. తన భర్తను చూసి ఆమె కంటతడి పెట్టుకుంది. తాను వచ్చానుగా అంటూ ఆమెను ఓదార్చారు భర్త. కాగా, ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. షేర్లు చేస్తూ నెటిజెన్లు ఈ ఆర్మీ దంపతులను అభినందిస్తున్నారు. ఈ స్వాగతం గొప్పగా ఉందంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.