27వేల మంది జవాన్లను తగ్గించే యోచనలో భారత ఆర్మీ...వీరి పరిస్థితేంటి..?
న్యూఢిల్లీ: మ్యాన్ పవర్ తగ్గించే యోచనలో భారత ఆర్మీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు 27వేల మంది సైనికులను తగ్గించేందుకు ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ఆర్మీలో కాకుండా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిని రద్దు చేయడం ద్వారా రూ.16వందల కోట్లు ఆదా చేయొచ్చనే ప్రతిపాదన సిద్ధం చేసింది. దాదాపు 12.5 లక్షల మంది సైనికులు ఆఫీసర్లు భారత ఆర్మీలో ఉన్నారు. అయితే ఇందులో కొందరు రెగ్యులర్ ఆర్మీలో కాకుండా ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. వీరి పై అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం 1,75వేల మంది జవాన్లు, ఇతర అధికారులు మిలటరీ ఇంజినీర్ సర్వీసెస్ నుంచి నేషనల్ క్యాడెట్ కార్ప్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, టెరిటోరియల్ ఆర్మీ, సైనిక్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. అంతేకాదు అస్సోం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్, స్ట్రాటిజిక్ ఫోర్సెస్ కమాండ్లో పనిచేస్తున్న వారు రెగ్యులర్ ఆర్మీ కిందకు రారు. డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో పై విభాగాల్లో పనిచేస్తున్న వారిలో 27వేల మంది జవాన్లను తగ్గించాలని ప్రతిపాదన చేశారు. ఇదే ప్రతిపాదనను రక్షణశాఖ కార్యాలయానికి పంపడం జరిగింది. రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 27వేల మంది సైనికులు తిరిగి ఆర్మీలో చేరుతారు.
ఈ 27వేల మంది వచ్చి రెగ్యులర్ ఆర్మీలో చేరితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇక రానున్న ఐదారేళ్లలో ఇతర విభాగాల్లో పని చేస్తున్న సైనికులను దాదాపు 1.5 లక్షల మందిని తీసుకొచ్చి రెగ్యులర్ ఆర్మీలో చేర్చడం వల్ల దాదాపు రూ.6వేల నుంచి రూ. 7వే కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. గతేడాది ఆర్మీ నాలుగు అంశాలపై సమీక్ష నిర్వహించింది. ఇందులో బలగాలను పెంచడం, సాధ్యసాధ్యాలు, హెడ్ క్వార్టర్స్ను విభజించడం, క్యాడర్ రివ్యూ, ఆఫీసర్లు, జవాన్లు ఎంతకాలం ఉంచాలా అనేదానిపై సమీక్ష నిర్వహించింది. వీటన్నిటినీ క్రమంగా ఈ ఏడాది నుంచి అమలు చేసేందుకు ఆర్మీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి అడుగు న్యూఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచే పడనుంది. స్టాఫ్ డ్యూటీలు చేస్తున్న 229 మంది అధికారులను ఫ్రంట్లైన్ ఆపరేషన్స్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు.మిలటరీ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ , లాజిస్టిక్స్, వ్యూహాత్మక ప్రణాళికల కోసం డిప్యూటీ చీఫ్ అనే ఓ కొత్త పోస్టును క్రియేట్ చేయనున్నారు.
ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో చాలామంది ఆఫీసర్లు పోస్టింగులు తీసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో అసలైన ఆర్మీలో శిక్షణ పొందిన అధికారులు లేకుండా పోయారు. ఇక ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపు పేరుతో ఓ టీములను తయారు చేయాలని భావిస్తోంది ఆర్మీ. పాకిస్తాన్తో సరిహద్దులు కలిగి ఉన్న జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ రెండు నుంచి మూడు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్లను ఉంచాలని ఆర్మీ భావిస్తోంది. అక్టోబర్ నవంబర్లోగా వీరందరిని అక్కడ ఉంచాలని భావిస్తున్న ఆర్మీ ఇందుకోసం అడుగులు వేగవంతంగా వేస్తోంది.