పెను మార్పు.. ఆర్మీ TOD ప్రతిపాదన.. మూడేళ్ల జవాన్ సర్వీస్.. యూత్ తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు..
భారత రక్షణ వ్యవస్థలో ముందుండి పనిచేసే సైనికుల నియామకం శాశ్వత ప్రాతిపదికన జరుగుతుందే తప్ప తాత్కాలిక ప్రాతిపదికకు అవకాశం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దేశభక్తి మెండుగా ఉండి.. దేశం కోసం కొద్దికాలమైనా ఆర్మీలో పనిచేస్తే బాగుండు అన్న ఆలోచన ఉండేవారు లేకపోలేదు. ఇలాంటి వారి కోసం భారత ఆర్మీ ఓ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. పెరుగుతున్న నిరుద్యోగానికి కొంతమేర అడ్డుకట్ట వేయడంతో పాటు ఆర్మీలో పనిచేయాలన్న యువత ఆకాంక్షను నెరవేర్చేలా 'టూర్ ఆఫ్ డ్యూటీ' అనే ప్రతిపాదనను రూపొందించింది.
త్వరలో పైలట్ ప్రాజెక్టుగా..
'టూర్ ఆఫ్ డ్యూటీ' ప్రతిపాదన ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చల దశలో ఉన్నట్టు కల్నల్ ఆమన్ ఆనంద్ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ప్రారంభించేందుకు పై స్థాయి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చిందన్నారు. దీని ప్రకారం మూడేళ్ల కాల పరిమితితో ఆర్మీలో ఇంటర్న్షిప్/తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యువతీ యువకులు ఇరువురికీ ఇందులో అవకాశం ఉంటుందని.. అయితే ఎంపిక విషయంలో ఆర్మీ ప్రమాణాలకు సంబంధించి ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
తప్పనిసరి కాదు.. వాలంటరీ..
నిరుద్యోగ పరిష్కారంతో పాటు యువతలో జాతీయవాదం,దేశభక్తి పెంచేందుకు 'టూర్ ఆఫ్ డ్యూటీ' ప్రతిపాదన దోహదపడుతుందని ఆమన్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది తప్పనిసరి ఏమీ కాదని.. ఆర్మీ పట్ల ఆసక్తి ఉన్న యువత స్వచ్చందంగా ముందుకు రావచ్చన్నారు. భారత సాయుధ దళాలో అధికారులు,ఇతర ర్యాంకులకు తొలుత ట్రయల్ ప్రాతిపదికన దీన్ని అమలుచేయనున్నారు. ప్రారంభంలో పరిమిత సంఖ్యలో మాత్రమే రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత దాని సక్సెస్ రేటును బట్టి విస్తరణ ప్రయత్నాలు ఉంటాయి.
ఇజ్రాయెల్ స్పూర్తితో..
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) నమూనాను స్పూర్తిగా తీసుకుని భారత్ దీన్ని అమలుచేయనుంది. ఇజ్రాయెల్లో శారీరకంగా,మానసికంగా ధృఢంగా ఉన్న ప్రతీ వ్యక్తి మూడేళ్ల పాటు మిలటరీ సర్వీసుల్లో పాలుపంచుకోవడం తప్పనిసరి. అయితే ఆ నిబంధనను మినహాయించి భారత్లో వాలంటరీ ప్రాతిపదికన దీన్ని అమలుచేయనున్నారు. అక్కడ ఒక ఏడాది ట్రైనింగ్తో పాటు మూడేళ్ల సర్వీసు చేయాల్సి ఉంటుంది.
TODలో చేరేవారికి ఏయే బెనిఫిట్స్..
'టూర్ ఆఫ్ డ్యూటీ' కింద ఆర్మీ విధుల్లో చేరేవారికి ప్రభుత్వం పన్ను మినహాయింపునివ్వాలని కూడా ప్రతిపాదించారు. అంతేకాదు,ప్రభుత్వ ఉద్యోగాల్లో,పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దీన్ని తప్పనిసరి చేయకపోవచ్చు. TODని పూర్తి చేసినవారికి.. ఆ తర్వాత కార్పోరేట్ రంగంలోనూ ప్రాధాన్యత ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆర్మీలో పనిచేసి ఉంటారు కాబట్టి క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారిని రిక్రూట్ చేసుకోవడానికి కార్పోరేట్లు ఆసక్తి కనబర్చవచ్చునని చెబుతున్నారు.
ఆర్మీకి ఖర్చు ఆదా..
ఈ ప్రతిపాదన ద్వారా ఆర్మీపై చేస్తున్న ఖర్చు విషయంలోనూ ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఆర్మీ అధికారి పదేళ్ల కాలానికి జీతభత్యాలతో కలుపుకుని రూ.5.12కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ మూడేళ్ల 'టూర్ ఆఫ్ డ్యూటీ'లో కేవలం రూ.80లక్షల నుంచి రూ.85లక్షలు మాత్రమే ఖర్చవుతాయి. ఒక జవాను 17 ఏళ్ల కాల పరిమితి కాకుండా కేవలం మూడేళ్లు మాత్రమే పనిచేయడం ద్వారా రూ.11.5కోట్లు ఆదా అవుతాయి. అలాగే ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న జవాన్లు,ఆర్మీ అధికారులపై పని ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.