‘పొరుగు’కు సందేశం: 20మంది ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ: భారత సైన్యం మిలిటెంట్లపై ప్రతీకారం తీర్చుకుంది. మణిపూర్లో 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న తిరుగుబాటుదారులపై ప్రతీకార దాడి చేసింది. గత రెండు రోజులుగా గాలింపు జరుపుతున్న ప్రత్యేక దళాలు మంగళవారం మయన్మార్లో 20 మంది తీవ్రవాదులను హతమార్చాయి.
ఈ తీవ్రవాదులే భారత సైనికులను హతమార్చారన్న విషయం రుజువుకావడంతో మయన్మార్లోకి వెళ్లి మరీ ప్రత్యేక దళాలు ఈ దాడులను నిర్వహించాయి. మయన్మార్ అధికారులు అందించిన సమాచారాన్ని ఆసరా చేసుకుని తాము మిలిటెంట్ స్థావారలపై ఈ దాడులు చేసినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.
ఎన్ఎస్సిఎన్(కె), కెవైకెఎల్ అనే మిలిటెంట్ల స్థావరాలపై ప్రత్యేక కమెండోలు ఈ దాడులు నిర్వహించారని వెల్లడించాయి. మొత్తం 20 మంది మిలిటెంట్లు హతులయ్యారని సైనిక దళాలకు ప్రాణనష్టం ఏమీ జరగలేదని తెలిపాయి. మణిపూర్ దాడి జరిగిన అనంతరం సైనిక దళాలు అత్యధికస్థాయి అప్రమత్తతను పాటించాయని ఆపరేషన్ల అదనపుడిజిపి రణబీర్ సింగ్ చెప్పారు.
గత రెండు మూడు రోజులుగా ఈ మిలిటెంట్ల స్థావరాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని తాము సేకరించామని అందుకే మయన్మార్లోకి చొచ్చుకెళ్లి మరీ వ్యూహాత్మక రీతిలో దాడుల చేశామని తెలిపారు. అలాగే ఈ మిలిటెంట్లు భారత్లో మరిన్ని దాడులు చేయడానికి కుట్ర పన్నుతున్నారని కూడా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
భద్రతా సిబ్బందిపైనా ఇతర దళాలపైనా కూడా గతంలో జరిగిన దాడుల్లో పాల్గొన్న మిలిటెంట్లే తదుపరి దాడులకు సిద్ధం అవుతున్నట్టుగా తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా తక్షణమే ఈ ఆపరేషన్ చేపట్టామని రణబీర్సింగ్ చెప్పారు.
భారత భద్రతకు, జాతీయ సమగ్రతకు ఏ రకమైన ముప్పు వాటిల్లినా దాన్ని తిప్పికొట్టేందుకు అసలు అందుకు అవకాశమే లేకుండా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లోనూ భారత్ను ఆనుకుని ఉన్న సరిహద్దుల్లోనూ ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే తమ ధ్యేయమని వెల్లడించారు. భారత-మయన్మార్ సరిహద్దుల్లో రెండు చోట్ల ఈ తాజా దాడులు నిర్వహించామన్నారు.
మయన్మార్ ఆపరేషన్ పొరుగు దేశాలకు సందేశం
కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ భారత సైన్యం నిర్వహించిన మయన్మార్ ఆపరేషన్పై ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని ఆదేశాల మేరకు సైన్యం తీవ్రవాదులపై దాడి చేసి మట్టపెట్టిందని చెప్పారు. మయన్మార్కు వెళ్లి తీవ్రవాదులను మట్టుబెట్టడం.. అపూర్వం, సాహాసోపేతమని అన్నారు. భారత సైన్యం చేసిన ఈ ఆపరేషన్ పొరుగుదేశాలకు స్పష్టమైన సందేశం పంపిందని అన్నారు.