ఎల్ఓసీ వెంబడి అలజడి : పాక్ కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు,మందుగుండు స్వాధీనం..
మరో ఉగ్ర కుట్రను భారత ఆర్మీ భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న కెరన్ సెక్టార్లో వాస్తవ నియంత్రణ రేఖ(LoC) వెంబడి కొంతమంది అనుమానాస్పద కదలికలను ఆర్మీ గుర్తించింది. స్థానిక కిషెన్గంగా నది సమీపంలో ఇద్దరు,ముగ్గురు వ్యక్తులు తాడుతో కట్టిన ఒక ట్యూబ్లో కొన్ని వస్తువులను సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ ట్యూబ్ను గుర్తించిన ఆర్మీ... అందులో నాలుగు ఏకె-74 రైఫిల్స్,8 మేగజైన్లు,240 రౌండ్ల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది.
అనంతరం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనిపై ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ... ఇది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కి చెందిన ఉగ్రవాదుల పనేనని చెప్పారు. పాకిస్తాన్ నుంచి భారత్లోకి అక్రమంగా ఆయుధాలను తరలిస్తుండగా.. తక్షణం రంగంలోకి దిగి కుట్రను భగ్నం చేశామన్నారు.
శ్రీనగర్కి చెందిన చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ... ఇప్పటికీ పాకిస్తాన్ బుద్ది మారలేదన్నారు.'ఈ ఉదయం,కెరన్ సెక్టార్లోని కిషెన్గంగా నది గుండా పాకిస్తాన్ నాలుగు ఏకె 47 రైఫిల్స్తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని భారత్లోకి పంపించే ప్రయత్నం చేసింది. కానీ సర్వైలైన్స్ డివైజ్లతో భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ పాక్ కుయుక్తులను భగ్నం చేస్తూనే ఉంటాం..' అని తెలిపారు.
Recommended Video
జమ్మూ సెక్టార్లోని కెరన్,తంగ్ధర్తో పాటు పంజాబ్లోనూ పాకిస్తాన్ ఇటువంటి కుయుక్తులకు తెరలేపినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కశ్మీర్ ప్రజలను నిరంతరం ఉగ్రవాదంలో ఉంచేందుకే పాక్ ఇలా ఆయుధాలను,మందుగుండును భారత్లోకి పంపిస్తోందన్నారు. కానీ పాక్ చర్యలను తాము అడ్డుకుంటూనే ఉంటామని... ఈ క్రమంలో స్థానిక ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు.