చైనా ముఖం పగిలే సమాధానం: అరుణాచల్ బోర్డర్ వద్ద భారత ఆర్మీ యుద్ధ సన్నాహకాలు
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్లోని వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన రూటు మార్చింది. ఇదివరకు సిక్కిం వద్ద డోక్లామ్ ట్రైజంక్షన్ను ఆధారంగా చేసుకుని, భారత భూభాగంలోనికి చొచ్చుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. భారత సరిహద్దు భద్రతా జవాన్లు సమర్థవంతంగా అడ్డుకోవడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్ను టార్గెట్గా చేసుకుంది. ఈ ఈశాన్య రాష్ట్రానికి అత్యంత సమీపంలో.. తన దేశ భూభాగంపై చైనా ఓ గ్రామాన్నే నిర్మించింది యుద్ధ ప్రాతిపదికన.
వెంకయ్య నాయుడు పర్యటననూ తప్పుపట్టిన డ్రాగన్..
కొద్దిరోజుల కిందటే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు.. భారత సరిహద్దు భద్రతా జవాన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సరిహద్దులను దాటుకుని రావడానికి ప్రయత్నించారు. చైనా సైనికుల ఆక్రమణ ప్రయత్నాలను భారత జవాన్లు తిప్పి కొట్టారు. వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అనుగుణంగా చైనా తన దందుడుకు చర్యలను మరింత ముమ్మరం చేసింది. సైన్యం సంఖ్యను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొద్దిరోజుల కిందటే- ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన పర్యటనను కూడా చైనా తప్పు పట్టిన విషయం తెలిసిందే.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా..
ఈ పరిణమాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోన్న భారత ఆర్మీ అధికారులు.. డ్రాగన్ కంట్రీ ముఖం పగిలే సమాధానం ఇవ్వడానికి సమాయాత్తం అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద జవాన్ల గస్తీని మరింత పెంచారు. ఆయుధ సంపత్తిని అక్కడికి తరలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సర్వ సన్నద్ధులమై ఉన్నామనే సంకేతాన్ని చైనాకు పంపించారు. చైనా దూకుడుకు కళ్లెం వేసేలా ఆర్మీ అధికారులు తక్షణ చర్యలను తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది.

వార్ డ్రిల్..
ఇందులో భాగంగా- తవాంగ్ సెక్టార్లో సరిహద్దు భద్రతా జవాన్లు వార్ డ్రిల్ను మొదలు పెట్టారు. భౌగోళికంగా రెండు దేశాలకు కూడా అత్యంత కీలకమైన సెక్టార్ ఇది. అరుణాచల్ ప్రదేశ్కు ఈశాన్య దిక్కున ఉంటుందీ తవాంగ్ సెక్టార్. ఇక్కడికి కూత వేటు దూరంలో ఉన్న భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఈ యుద్ధ సన్నాహకాలను చేపట్టింది. వార్ డ్రిల్ను కొనసాగిస్తోంది. యుద్ధం అంటూ జరిగితే- శతృవును ఎలా తుద ముట్టించాలనే లక్ష్యంతో ఈ డ్రిల్ సాగుతోంది. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో, పర్వత శ్రేణువుల్లో యుద్ధాన్ని ఎలా సాగించాలనేది ఈ డ్రిల్ ముఖ్య లక్ష్యమని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
శతృవును తుద ముట్టించడంపై..
యుద్ధంలో శతృసైన్యాన్ని ఎలా తుదముట్టించాలనే విషయంపై దీన్ని నిర్వహిస్తున్నామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మిలటరీ ఎక్సర్సైజ్గా దీన్ని భావిస్తున్నామని చెప్పారు. భారత్ చేపట్టిన వార్ డ్రిల్పై చైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తవాంగ్ సెక్టార్లో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి ఎప్పటికిప్పుడు అధికారులు ఆరా తీస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. భారత్ ఈ వార్ డ్రిల్ను చేపట్టడం పట్ల కొంత అసహనం, అసంతృప్తి వ్యక్తమౌతున్నట్లు అంచనా వేసింది.