ఉగ్రవేట, శత్రుదేశాలకు ధీటుగా..: 72000ల సిగ్ సౌర్ 716 అమెరికన్ అసాల్ట్ రైఫిల్స్ ఆర్డర్
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడింది. తాజాగా, అమెరికా నుంచి 72000 పవర్ ఫుల్ సిగ్ 716 అసాల్ట్ రైఫిల్స్ను రెండోసారి ఆర్డర్ చేసింది.
ఇప్పటికే భారత భద్రతా దళాల చేతుల్లోకి 72000 అసాల్ట్ రైఫిల్స్
ఇప్పటికే ఆర్డర్ చేసిన 72000 సిగ్ 716 అసాల్ట్ రైఫిల్స్ భారత్ చేరాయి. ఇప్పుడు వాటిని నార్తెర్న్ కమాండ్, ఇతర ఆపరేషన్స్ కోసం భారత దళాలు ఉపయోగిస్తున్నాయి. వీటిని ఎక్కువగా ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రోక్యూర్మెంట్(ఎఫ్టీపీ) కార్యక్రమం కింద ఇండియా వీటిని పొందింది.
ఆ గన్స్ స్థానంలో అసాల్ట్ రైఫిల్స్.. ప్రత్యేక నిధి నుంచి కొనుగోళ్లు
కేంద్ర ప్రభుత్వం కొత్త ఆయుధాలను కొనుగోలు చేసేందుకు రూ. 500 కోట్లను భద్రతా దళాలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నిధులను ఉపయోగించుకుని 72000 రైఫిల్స్ కొనుగోలు చేస్తున్నామని డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం స్థానిక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్ తయారు చేసిన ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్(ఐఎన్ఎస్ఏఎస్) 5.56X45ఎంఎం రైఫిల్స్ స్థానంలో ప్రస్తుతం ఆర్డర్ చేసిన సిగ్ 716 అసాల్ట్ రైఫిల్స్ ను భద్రతా దళాలు ఉపయోగించనున్నాయి.
ఉగ్రవేట, శత్రదేశాలకు ధీటుగా బదులు..
ఉగ్రవాదుల ఆపరేషన్స్, నియంత్రణ రేఖ వెంబడి ఉండే భద్రతా దళాలు దిగుమతి చేసుకునే 1.5 లక్షల రైఫిల్స్ను, మిగితా బలగాలు రష్యా-ఇండియా సంయుక్తంగా అమేథిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఏకే-203 రైఫిల్స్ ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా రక్షణ శాఖ 16000 లైట్ మెషిన్ గన్స్(ఎల్ఎంజీ),లను ఇజ్రాయెల్ నుంచి ఆర్డర్ చేసింది. ఉగ్రవాదుల వేటకు, శత్రుదేశాల నుంచి వచ్చే మూకలను ఏరివేసేందుకు అసాల్ట్ రైఫిల్స్ భద్రతా దళాలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Recommended Video
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో..
భారత్-చైన్ సరిహద్దు ప్రాంతమైన వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే మొదటి వారం నుంచే చైనా 20వేల బలగాలను మోహరించింది. భారత్ కూడా ఆ మేరనే భద్రతా దళాలతో సరిహద్దు వెంబడి నిఘా పెట్టింది. జూన్ 15న జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో మోహరించిన ఇరుదేశాల బలగాలను వెనక్కితీసుకున్నాయి. శాంతి చర్చలు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. అయితే, ఇటు చైనా, అటు పాకిస్థాన్ దేశాలతో ముప్పు పొంచివున్న నేపథ్యంలో భారత్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాల నుంచి ఆధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది.