మళ్లీ సర్జికల్స్ట్రైక్స్ లాంటి దాడులు: 4పాక్ శిబిరాలు ధ్వంసం, 20మంది హతం
న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి దాడులు జరిపాయి. సరిహద్దుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్థాన్ దళాలను చావుదెబ్బ కొట్టాయి. నియంత్రణ రేఖ వెంబడి శతఘ్నులతో కాల్పులకు దిగి.. పాక్ సైన్యానికి చెందిన నాలుగు శిబిరాలను ధ్వంసం చేశాయి. 20 మంది శత్రు సైనికులను హతమార్చాయి.
అక్టోబర్ 29న చోటుచేసుకున్న ఈ దాడుల వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లా మచ్చిల్ సెక్టార్లో ఇటీవల ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి వచ్చి భారత జవాను తల నరకడంలో కాల్పులతో సహకరించిన పాక్ దళాలపై.. ఈ దాడులతో సైన్యం ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
కుప్వారా జిల్లాలోని కెరణ్ సెక్టార్లో పాక్ బలగాలపై భారత సైన్యం అక్టోబర్ 29న ఉధృతంగా దాడులు చేశాయి. శతఘ్నుల సాయంతో జరిపిన ఈ దాడుల్లో నాలుగు పాక్ సైనిక శిబిరాలు, ఓ పటాలం ప్రధాన కార్యాలయం నేలమట్టమయ్యాయి. 2003లో ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసిన నాటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి శతఘ్నులను ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
శతఘ్నుల వినియోగించిన విషయాన్ని అధికారవర్గాలు కూడా నిర్ధారించాయి. పాక్కు ధీటైన జవాబు చెప్పేందుకుగాను నియంత్రణ రేఖ సమీపంలో శతఘ్నులను మోహరించామని.. ఇటీవలి దాడుల్లో వాటిని వినియోగించామని వెల్లడించాయి.
99సార్లు పాక్ ఉల్లంఘనలు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించిన తర్వాత ఇప్పటి వరకు పాకిస్తాన్ బలగాలు జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఒసి) పొడవున గల ఇండియన్ పోస్టులను, ప్రజల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 99సార్లు కాల్పులు జరిపాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ 99 సార్లు ఉల్లంఘించిందని ఒక సీనియర్ సైనికాధికారి శుక్రవారం వెల్లడించారు.