చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: ఇదీ అసలు సంగతి
డోక లా ప్రాంతంలో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ ఘటన రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ/ బీజింగ్: సిక్కిం రాష్ట్రంలో భారత్ - చైనా - భూటాన్ మధ్య ముక్కోణ జంక్షన్ పరిధిలో గల పాతకాలం నాటి భారత సైనిక బంకర్ను చైనా ధ్వంసం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా కయ్యానికి కాలు దువ్వుతోంది. డోక లా ప్రాంతంలో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ ఘటన రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
సరిహద్దులకు సమీప భారత భూభాగంలో పాత భూగర్భ రక్షణ గృహాల నవీకరణ, కొత్త భూగర్భ రక్షణ గృహాల నిర్మాణాన్ని మన సైనికులు చేపట్టటాన్ని చైనా సహించలేకపోతోంది. పదే పదే అభ్యంతరం చెబుతోంది. ఆ బంకర్ను ధ్వంసం చేయాలని ఈ నెల ప్రారంభంలో చైనా చేసిన విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చింది.
ఇదే క్రమంలో డోక లా ప్రాంతంలోని పాత బంకర్ను తొలగించాలన్న చైనా సైన్యం సూచనను భారత్ సైన్యం అంగీకరించకపోవటంతో వారే భారీ యంత్రాలను తీసుకొచ్చి కూల్చివేశారని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. బుల్డోజర్తో బలవంతంగా బంకర్ను చైనా సైన్యం ధ్వంసం చేయడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
సిల్క్రోడ్పై ఇలా భారత్ వైఖరి
జమ్ముకాశ్మీర్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకూ భారత్ - చైనా మధ్య మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దీనిలో 220 కిలోమీటర్ల సిక్కిం సెక్టార్లోకి వస్తుంది. ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో దలైలామా పర్యటనతో చైనా కినుక వహించినట్లు తెలుస్తున్నది. మరోవైపు సిక్కిం సెక్టార్ పరిధిలో డోంగ్లాంగ్లో రోడ్డు నిర్మాణం చట్టబద్ధమేనని బుధవారం చైనా సమర్థించుకున్నది. దీనికి తోడు అంతర్జాతీయంగా వివిధ దేశాల సరిహద్దులను తాకుతూ ‘సిల్క్ రోడ్' నిర్మాణానికి పూనుకున్న చైనా.. జమ్ము కశ్మీర్లోని వివాదాస్పద ప్రాంతం మీదుగా చైనా - పాక్ ఎకనమిక్ కారిడార్ అని నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణంపై భారత్ అభిప్రాయానికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. అయితే ఇటీవల భారత్, అమెరికా మధ్య సత్సబంధాలు బలోపేతం అవుతున్నా కొద్దీ.. చైనా తన వ్యూహాలకు పదును పెడుతోంది.
భారత్ వైఖరి పట్ల ఆగ్రహిస్తున్న చైనా
అందులో భాగంగానే జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ను వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకున్నది. ఇటీవల సిల్క్ రోడ్డు నిర్మాణానికి నిర్వహించిన సదస్సుకు భారత్ దూరంగా ఉండటంతో చైనా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కానీ తాజాగా నెల రోజులుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కుదిరిన ఒప్పందాన్ని కూడా తోసి రాజని నాథుల్లా పాస్ మీదుగా కైలాస్ మానస సరోవర్ దేవాలయ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బ్రుందాన్ని వెనక్కు తిప్పి పంపింది. దీనికి అసలు కారణాలు చెప్పనేలేదు. యాత్రికుల వద్ద చైనా వీసాలు ఉన్నా అనుమతి నిరాకరించడం గమనార్హం. యాత్రికులు వెళ్లే మార్గంలో వంతెన దెబ్బ తిన్నదని చైనా వర్గాలు చెప్తున్నాయి. ఇక సిక్కిం పరిధిలో భారత భూభాగంలో సరిహద్దు వెంబడి యదేచ్ఛగా రహదారి నిర్మాణం చేపట్టింది.
కేంద్రానికి సిక్కిం ప్రభుత్వ నివేదిక ఇలా
ఇది తమ భూభాగమేనని, భారత్ గానీ, భూటాన్గానీ జోక్యం చేసుకోరాదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లు కంగ్ మీడియాతో అన్నారు. డోక లా ప్రాంతంతో పాటు సరిహద్దు వెంట ఉన్న మొత్తం పరిస్థితిని కేంద్రానికి సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. భారత్ బంకర్ను కూల్చేసిన విషయాన్ని వెల్లడించకుండా భారత సైన్యమే తమ భూభాగంలో ప్రవేశించిందని చైనా ఆరోపిస్తూ మంగళవారం ఫిర్యాదు చేసింది. భారత సైనికులు తక్షణమే వెనక్కు వెళ్లాలని డిమాండ్ చేసింది. లేకుంటే మానసరోవర్ యాత్రికులను అనుమతించబోమని హెచ్చరించింది.
ఉగ్రవాదంపై భారత్, అమెరికా ఇలా
ఉగ్రవాదంపై తన మిత్రపక్షం పాకిస్థాన్ దృఢంగా పోరాడుతున్నదని చైనా పేర్కొంది. కశ్మీర్ లోయలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం నిలిపేయాలని పాక్కు భారత్, అమెరికా పిలుపునిచ్చాయి. అంతే కాదు ముంబై, పఠాన్ కోట్ తదితర ఘటనల్లో కుట్రదారులను చట్టానికి పట్టివ్వాలని ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ డిమాండ్ చేసిన నేపథ్యంలో చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లు కంగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయ సహకారంతోనే ఉగ్రవాదాన్ని తుదముట్టించవచ్చునన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయ సమాజం గుర్తింపు ఇవ్వవచ్చునని పేర్కొన్నారు.
మూడు నుంచి భారత్ - థాయిలాండ్ సంయుక్త సైనిక విన్యాసాలు
భారత సైనికాధిపతి జనరల్ బిపిన్ రావత్ గురువారం చైనా సరిహద్దుల్లోని సిక్కిం రాష్ట్రంలో పర్యటిస్తారు. భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బిపిన్ రావత్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రెండు రోజుల పాటు సిక్కింలో పర్యటించారు. సాధారణ పర్యటన అయినా వ్యూహాత్మకంగా భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దు ప్రాంతం ‘ముక్కోణ జంక్షన్' పరిధిలో జనరల్ బిపిన్ రావత్ పర్యటించడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ఈశాన్య బారత రాష్ట్రాల పరిధిలో కొత్త హెడ్ క్వార్టర్స్ ప్రారంభంతోపాటు సైన్యం ఆపరేషనల్ కార్యక్రమాలు ఆయన సమీక్షిస్తారు. ఇక సోమవారం నుంచి థాయిలాండ్ - భారత్ సైన్యం సంయుక్త సైనిక విన్యాసాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బాక్లోహ్లో జరుగుతాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.