సముద్రపు దొంగల అటాక్.. ఇండియన్ కార్గో షిప్ హైజాక్
భారతదేశానికి చెందిన ఓ కార్గో షిప్ ను రెండ్రోజుల క్రితం సోమాలియా సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేశారు.
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ఓ కార్గో షిప్ ను సోమాలియా సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేశారు. ఏప్రిల్ 1న ఈ షిప్ హైజాక్ కు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. హైజాక్ కు గురైన సమయంలో షిప్ లో 11 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ షిప్ దుబాయ్ నుంచి యెమెన్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సోమాలియా సముద్రపు దొంగల చేతిలో బందీలుగా ఉన్న 11 మంది సిబ్బంది ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని తెలుస్తోంది.
షిప్ హైజాక్ కు గురైన విషయాన్ని షిప్ కెప్టెన్ దుబాయ్ లోని అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్గో షిప్ హైజాక్ అయిందన్న సమాచారం అందగానే కలకలం రేగింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ షిప్ హైజాక్ ఘటనను ధ్రువీకరించింది. షిప్ లోని సిబ్బందిని రక్షించేందుకు అవసరమైన అన్న రకాల చర్యలూ చేపడుతున్నట్లు భారత నౌకాదళ అధికారులు వెల్లడించారు.