భారత్లో 38 నగరాలు హైరిస్క్ భూకంప జోన్లు
న్యూఢిల్లీ: నేపాల్ భారీ భూకంపం అందర్నీ కలచివేస్తోంది. ప్రపంచం దిగ్భ్రాంతికి గురయింది. యావత్ ప్రపంచం నేపాల్కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భారత్ తక్షణమే స్పందించి, పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తోంది. నేపాల్ భూకంపం భారత్ను కూడా తాకింది. ఈ తాకిడికి 72 మంది మృతి చెందినట్లు కేంద్రం ప్రకటించింది.
ఇదిలా ఉండగా, భారత దేశంలో 38 నగరాలు అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఉత్తారాది రాష్ట్రాల్లో భారీ నష్టం జరిగింది. హిమాలయాలలో వచ్చే భూప్రకంపనల వల్ల ఆసియా ప్రధాన ప్రాంతాల పైన ప్రభావం పడనుంది.
భారత దేశంలో చాలా తక్కువ భవనాలు మాత్రమే భూకంపాలను తట్టుకునే ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. 1962లో, 2005లో భూకంపాలను తట్టుకునేలా నిర్మించే ప్రమాణాలు రూపొందించారు. అయితే, దాదాపు అవి ఎవరికీ తెలియవని చెప్పవచ్చు.
భూకంపాలను తట్టుకొనే స్థాయిలో నిర్మించిన వాటిలో ఢిల్లీ మెట్రో ఒకటి. గుజరాత్లో 2001లో వచ్చిన భుజ్ భూకంపం అనంతరం... చాలా ఇళ్లు అక్కడ ప్రమాణాలతో నిర్మించారు.
గతంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు దాదాపు పదివేల మంది మృతి చెందారు. చాలామంది భూకంపం వచ్చినప్పుడు... ఇళ్లు కూలడం వంటి వాటి వల్లనే చనిపోతున్నారు. ప్రమాణాల ప్రకారం నిర్మిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది. భారత దేశంలో మొత్తం 38 నగరాలు హైరిస్క్ భూకంపం జోన్లో ఉన్నాయి.