వారికి భారత పౌరసత్వం భరోసా కల్పిస్తుంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తమ సొంతదేశాల్లో వివక్షకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఒక భరోసాను ఇస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అంతేకాదు రేపటి వారి జీవితంకు గ్యారెంటీని ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. హిందుస్తాన్టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుంచి వివక్షకు గురై భారత్కు వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ బిల్లుకు సవరణలు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై...
పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న వారు భరతమాతపై నమ్మకం ఉంచి ఇక్కడకు చేరుకున్నారని ఇంకా ఎవరున్నా సరే భారత పౌరసత్వం కల్పించి వారికి అద్భుతమైన భవిష్యత్తును కల్పిస్తామని ప్రధాని మోడీ చెప్పారు.ఇక సవరణలు చేసిన పౌరసత్వ బిల్లును పార్లమెంటులో వచ్చేవారం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
గతం గురించి మర్చిపోవాలి
ఇక అయోధ్య గురించి మాట్లాడిన ప్రధాని మోడీ... గతంను తలుచుకుని బాధపడుతూ కూర్చోలేమని రామజన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో మంచి రోజులు వస్తున్నాయన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యిందని మోడీ చెప్పారు. అయితే అయోధ్య తీర్పుతో దేశవ్యాప్తంగా అలజడిలు ఆందోళనలు, అల్లర్లు జరుగుతాయని అంతా భావించారని కానీ భారతదేశ ప్రజలు అవన్నీ తప్పని రుజువు చేశారని మోడీ చెప్పారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు పై
ఇక జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రధాని సమర్థించారు.అయితే రాజకీయంగా ఇది క్లిష్టమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందన్నారు.ఆర్టికల్ 370 రద్దు చేయడంతోనే జమ్మూ కశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి పరంగా పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రజలు భారతదేశంలో ఉన్నప్పటికీ వారు పూర్తి స్వేచ్ఛతో ఉండేవారు కాదని దీనంతటికీ కారణం ఆర్టికల్ 370 అని చెప్పారు. అందుకే నిర్ణయం కష్టమైనది అయినప్పటికీ అక్కడి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశామని చెప్పారు.
ప్రజల జీవితాల్లో ప్రభుత్వం అజమాయిషీ ఉండరాదు
ప్రజల జీవితాలపై ప్రభుత్వం అజమాయిషీ ఉండటాన్ని తానెప్పుడూ సమర్థించలేదని మోడీ చెప్పారు. అందుకే మినిమమ్ గవర్నమెంట్ మ్యాక్సిమమ్ గవర్నెన్స్ అనేదానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను గుర్తించి వాటిని సరిచేస్తే సరిపోతుందని చెప్పారు. దేశానికి మంచి పాలన అందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మోడీ అభిప్రాయపడ్డారు.
బ్యాంకర్లు నిర్ణయాలను ప్రశ్నించలేము
బ్యాంకుల విలీనంపై కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. బ్యాంకర్లు ఎలాంటి భయం లేకుండా తమ పని తాము చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. వారు పారదర్శకంగా తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించరని గుర్తుచేశారు. ఒకప్పుడు బ్యాంకుల జాతీయం జరిగినప్పుడు ఒక వేడుకే జరిగిందని గుర్తు చేసిన ప్రధాని ప్రధాన పత్రికలో ఆర్టికల్స్ వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరించిందని చెప్పారు. బ్యాంకుల విలీనంకు ముందు కొంతమంది నిపుణలు అభిప్రాయం తెలుసుకున్నామని చెప్పారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది. బ్యాంకింగ్ రంగం కొన్ని సవాళ్లను అదేసమయంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని త్వరలోనే బ్యాంకులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.