షాకింగ్ : భారత్లో కొత్త కరోనా N440K.. ఏపీలో 34శాతం మందికి.. మొత్తం 19 వేరియంట్స్..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా వైరస్ దాన్ని రూపాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఒక వేరియంట్ నుంచి మరో వేరియంట్కు శరవేగంగా మ్యుటేషన్ చెందుతోంది. ఇందుకోసం చాలా దేశాలు కరోనా పేషెంట్ల శాంపిల్స్ నుంచి పెద్ద ఎత్తున జీనోమ్(జన్యు)విశ్లేషణలు చేస్తున్నాయి. బ్రిటన్లో ఇప్పటివరకూ 1,57,000 జీనోమ్స్ను, అమెరికాలో 50వేల జీనోమ్స్ను విశ్లేషించారు. ఈ దేశాలతో పోల్చితే భారత్లో అత్యంత తక్కువ స్థాయిలో జీనోమ్ విశ్లేషణ జరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో నమోదైన కోవిడ్ 19 కేసుల నుంచి కేవలం 5శాతం జీనోమ్స్ను మాత్రమే విశ్లేషించగలిగారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో వైరస్ కొత్త వేరియంట్ను కనుగొన్నారు.
అప్పుడు 'గో కరోనా గో...' ఇప్పుడు కొత్త స్లోగన్ ఇచ్చిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే...
ఏపీలో 34శాతం మందికి కొత్త వేరియంట్...
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,మహారాష్ట్ర,కర్ణాటక,పశ్చిమ బెంగాల్,ఉత్తరాఖండ్,హర్యానా,ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కొత్త మ్యుటేషన్లను(కొత్తగా రూపాంతరం చెందిన వైరస్) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఒక వేరియంట్కు N440Kగా నామకరణం చేశారు. ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,మహారాష్ట్ర,కర్ణాటకల్లో ఉన్నట్లు గుర్తించారు. ఏపీలో విశ్లేషించిన 272 జీనోమ్ శాంపిల్స్లో 34 శాత మందిలో N440K వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్కు యాంటీ బాడీల నుంచి తప్పించుకునే లక్షణాలు ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. N440K వేరియంట్కి సంబంధించి మరింత డేటాతో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపనున్నారు. తద్వారా కరోనా వ్యాక్సిన్లకు ఈ కొత్త వేరియంట్ లొంగుతుందా లేదా అన్నది నిర్దారించనున్నారు.
తెలంగాణలో 7 పాజిటివ్లకు జీ మ్యాపింగ్...
ఇటీవల యూకె నుంచి తెలంగాణకు వచ్చిన 20 మందికి కరోనా పాజిటివ్గా తేలగా... ఇందులో 7 పాజిటివ్లకు సంబంధించి సీసీఎంబీ సైంటిస్టులు జీనోమ్ మ్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్కు పంపించినట్లు సమాచారం. వీరికి సోకింది బ్రిటన్లో వెలుగుచూసినా వేరియంటా లేక ఇక్కడి కొత్త వేరియంటా అన్నది తేలాల్సి ఉంది.దేశంలో వైరస్లు మ్యుటేషన్లు చెందుతున్నా... కొత్త వేరియంట్స్ వెలుగుచూస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వీటిపై క్లారిటీ రాకపోవడంపై చర్చ జరుగుతోంది. అన్ని దేశాలు జీనోమ్ సీక్వెన్స్ను గుర్తించేందుకు,కొత్త మ్యుటేషన్లతో వెలుగుచూస్తున్న వేరియంట్స్ను నిర్దారించేందుకు విస్తృత చర్యలు చేపడుతుండగా భారత్లో ఆ ప్రయత్నాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి.
దేశంలో మొత్తం 19 వేరియంట్స్
దేశంలో ఇప్పటివరకూ ఎన్నో రకాలుగా కరోనా వైరస్ మ్యుటేషన్ చెంది ఉంటుందని... కానీ వాటిని గుర్తించడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా మ్యుటేషన్ చెందుతున్న వైరస్లలో చాలావాటికి యాంటీబాడీల నుంచి తప్పించుకునే లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోని 133 దేశాల్లో ఇప్పటివరకూ 2,40,000 జీనోమ్లను విశ్లేషించిన శాస్త్రవేత్తలు 126 వేరియంట్స్(వైరస్ రకాలు) గుర్తించారు. ఇందులో 86 వేరియంట్స్ 63 దేశాల్లో వ్యాప్తిలో ఉన్నట్లుగా గుర్తించగా... భారత్లో 19 వేరియంట్స్ వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు.
ఇప్పటివరకూ 6370 జీనమ్స్ విశ్లేషణ...
ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్&ఇంటిగ్రేటివ్ బయాలజీ దేశంలోని జీనోమ్స్ను విశ్లేషిస్తోంది. ఇప్పటివరకూ దేశంలోని 6370 జీనోమ్స్ను విశ్లేషించిన ఈ సంస్థ... దేశవ్యాప్తంగా 2శాతం జీనోమ్స్లో N440K వేరియంట్ను గుర్తించినట్లు తెలిపింది. ఆసియాలో జులై-అగస్టు మధ్యలో ఈ వేరియంట్ బయటపడినట్లు తెలిపింది. కేరళలోని 14 జిల్లాల్లో నమోదవుతున్న కరోనా కేసులపై సమగ్ర అధ్యయనం చేపట్టి అక్కడి జీనోమ్స్ను విశ్లేషించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది.