సెనేట్కు రక్షణ బిల్లు: 'అమెరికా గుప్పిట్లోకి మన ఆర్మీ'
భారత ఆర్మీ అమెరికా నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని సిపిఎం నాయకులు సీతారాం ఏచూరీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ: భారత ఆర్మీ అమెరికా నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని సిపిఎం నాయకులు సీతారాం ఏచూరీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన సైన్యం, మిలిటరీ ఉత్పత్తులు అమెరికా నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.
మేజర్ డిఫెన్స్ పార్టనర్ పేరిట రూపొందించిన నివేదికని అమెరికా ప్రభుత్వం సెనేట్ ముందు ఉంచిందని అక్కడ ఆమోదం లభిస్తే, మన సైన్యం పైన అమెరికాకు ప్రత్యక్ష పర్యవేక్షణ అధికారం లభిస్తుందన్నారు.
ఎఫ్వై 2017 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)లో భాగంగా తయారుచేసిన ఈ నివేదికలో.. మిలిటరీ రంగంలో తన జూనియర్ భాగస్వామిగా భారత్ను అమెరికా పేర్కొందన్నారు. ఇంత ముఖ్యమైన అంశంపై మోడీ ప్రభుత్వం పార్లమెంటులో కనీస ప్రకటన కూడా చేయలేదన్నారు.
నివేదికను బట్టి మనదేశం అమెరికా పక్షం తీసుకున్నట్లుగా తెలుస్తోంది, అయితే, దానికోసం తనవైపు నుంచి భారత్ ఏఏ హామీలు ఇచ్చింది అనేది మాత్రం తెలియడం లేదన్నారు. దక్షిణాసియా, ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత నుంచి రక్షణ, భద్రతాపరమైన సహకారాన్ని పొందనున్నట్టు నివేదికలో ఉందన్నారు.