సాధారణ స్థితికి భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా..
లాక్ డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎకానమీ సాధారణ స్థితికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంతో, వృద్ధిని పునరుద్ధరించొచ్చు అని అభిప్రాయపడ్డారు. 7వ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ కాంక్లేవ్లో శనివారం ఆయన మాట్లాడారు.
సంక్షోభ సమయంలోనూ భారతీయ కంపెనీలు, పరిశ్రమలు మెరుగ్గా స్పందిస్తున్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. వైరస్ మార్కెట్పై ప్రభావం చూపించిందని.. అయితే ఆయా రంగాల్లో డిమాండ్ సాధారణ పరిస్థితికి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ సమూలంగా తగ్గి, డిమాండ్ పెరిగితే వృద్ది పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రభుత్వం ప్రకటించిన లక్ష్య, సమగ్ర సంస్కరణ చర్యలు దోహదపడతాయని అభివర్ణించారు.
కరోనా వైరస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి పెంచడం, ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక స్థిరత్వం, బ్యాంకింగ్ వ్వవస్థను సమన్వయం చేసేందుకే సెంట్రల్ బ్యాంక్ విశేషంగా కృషి చేస్తుందని వివరించారు. ద్రవ్య విధాన కమిటీ 2019 ఫిబ్రవరి నుంచి పాలసీ రేట్లను 250 బేసిస్ పాయింట్లను తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా బ్యాంకులు, ఆర్థిక ఇంటర్ మిడియేటర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకొని, రిస్క్ లేకుండా పనిచేయాలన్నారు.