పెళ్లే కానుక: భారత్-పాక్ జంటను కలిపిన సుష్మా, రుణపడి ఉంటామన్న నవదంపతులు
న్యూఢిల్లీ/లక్నో: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను ఎవరైనా సరే సాయమంటూ ఆర్థిస్తే చాలు.. నేనున్నానంటూ ముందుకొచ్చి వారి బాధలను తీర్చేస్తారు. భారతీయులకే కాదు, సాయం కోరిన దాయాది దేశం పాకిస్థాన్ పౌరులకు ఆమె ఎన్నోసార్లు సాయమందించారు.
తాజాగా, ఇరుదేశాలకు చెందిన ఓ జంట వివాహానికి సాయపడి వారిద్దరూ ఒక్కటయ్యేలా చేశారు సుష్మా. పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి కుదిరింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అబ్బాయితో. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కానీ, నవ వధువుకు, ఆమె కుటుంబసభ్యులకు వీసా మంజూరు కాలేదు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వారికి సాయం చేశారు. దీంతో తమ పెళ్లికి శుభం కార్డు పడిందని చెబుతున్నారు ఆ నూతన దంపతులు.
రెండేళ్ల క్రితం పెళ్లి నిశ్చయం
ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన నఖీ అలీఖాన్కు పాకిస్థాన్లోని కరాచీకి చెందిన సబహత్ ఫాతిమాకు రెండేళ్ల క్రితం పెళ్లి నిశ్చయమైంది. నఖీ అమ్మమ్మ.. ఫాతిమా నానమ్మ అక్కాచెల్లెళ్లు. భారత్-పాక్ విడిపోక ముందు వరకు వీరి కుటుంబాలు కలిసే ఉండేవి. విడిపోయిన తర్వాత ఫాతిమా కుటుంబం కరాచీ వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితమే నఖీ, ఫాతిమాకు పెళ్లిచేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ఫాతిమాకు వీసా రాకపోవడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.
సుష్మాను సాయం కోరగానే..
ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని సమయంలో నఖీ.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరారు. స్పందించిన సుష్మా స్వరాజ్ వెంటనే ఫాతిమాకు వీసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఇటీవలే ఫాతిమాకు వీసా వచ్చింది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు మొదలుపెట్టాయి. గత శుక్రవారం వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ధన్యవాదాలంటూ నవ వరుడు
ఈ సందర్భంగా తమ పెళ్లి జరిగేందుకు సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు నఖీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇంత మంచి బహుమతి ఇచ్చిన సుష్మాజీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. త్వరలోనే ఫాతిమాకు భారత పౌరసత్వం కూడా కల్పిస్తారని ఆశిస్తున్నాం' అని నఖీ తెలిపారు.
దాయాది దేశమైనా సాయమందిస్తారు
కాగా, దాయాది దేశమైన పాక్ పౌరులకు సుష్మా సాయం చేయడం ఇది తొలిసారి కాదు. గత ఆగస్టులో కూడా కరాచీకి చెందిన సాదియా, లక్నోకి చెందిన సయ్యద్ షారిక్లకు కూడా ఇదే సమస్య వచ్చినపుడు ఆమె తన వంతు సాయం చేసి వారి పెళ్లి జరిగేలా చేశారు. అంతేగాక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ భారత్లో చికిత్స కోసం వచ్చే ఎందరో పాకిస్థానీయులకు సుష్మా సాయం అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ భారత సాయం కోరేవారికి సుష్మ సాయమందిస్తూనే ఉన్నారు.