యూట్యూబ్..ఫేస్బుక్ లో మనోళ్లు ఏం చూస్తున్నారో తెలుసా?
దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్, ఫేస్బుక్లను ఎక్కువగా ఏఏ అంశాల కోసం ఉపయోగిస్తున్నారనేది విడూలీ మీడియా టెక్ అనే వీడియో ఇంటలిజెన్స్ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో తెలిసిపోయింది.
న్యూఢిల్లీ : దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్, ఫేస్బుక్లను ఎక్కువగా ఏఏ అంశాల కోసం ఉపయోగిస్తున్నారో ఓ సర్వేలో తెలిసిపోయింది. విడూలీ మీడియా టెక్ అనే వీడియో ఇంటలిజెన్స్ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్ లా మారిన ఢిల్లీ.. స్కూళ్లకు నిరవధిక సెలవులు..
ఈ సర్వే వివరాలను విడూలీ మీడియా టెక్ సీఈవో సుబ్రత్ కర్ మంగళవారం వెల్లడించారు. నెటిజన్లు మ్యూజిక్ కోసం యూట్యూబ్ను, వార్తల కోసం ఫేస్బుక్పైన ఆధారపడుతున్నారట. దాదాపు 3 బిలియన్ల మంది నెట్ వీక్షకులు సంగీతం కోసం యూట్యూబ్ను వాడుతుండగా, దాదాపు 2.4 బిలియన్ల మంది వినోద కార్యక్రమాల కోసం ఆశ్రయిస్తున్నారు.
మూడో స్థానం చిన్నారుల కార్యక్రమాలు. ఈ విభాగంలో దాదాపు 1.3 బిలియన్ వ్యూస్ ఉన్నాయట. అదేవిధంగా వార్తాంశాల విభాగంలో 1.58 బిలియన్లు, వినోదం విభాగంలో 1.06 బిలియన్ వ్యూస్ ఉన్నాయని ఆయన తెలిపారు.
ఫేస్బుక్లో వార్తాంశాల వీడియోల తర్వాత వినోదాంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగీతం, వినోదం, వార్తల వీడియోలను చూసే వారి సంఖ్య ఒక్కసారిగా దాదాపు 40 శాతం పెరిగిపోయింది. 2వ, 3వ స్థాయి పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్లు సర్వే తేల్చింది.
దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 400 మిలియన్ల మంది ఉండగా అందులో యూట్యూబ్ చూసేవారి సంఖ్య అందులో ప్రధానంగా ఉంటోంది. సుమారు 241 బిలియన్ల వినియోగదారులతో ఫేస్బుక్ దేశంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమంగా నిలిచింది. దేశంలో 18-65 మధ్య వయసు ఉన్న 641 మిలియన్ల మంది నెట్ వినియోగదారుల అభిరుచులను విడూలీ సంస్థ విశ్లేషించి ఈ వివరాలను నమోదు చేసింది.
దీని ప్రకారం యూట్యూబ్ ఛానెళ్లలో టాప్-10లో ఉన్నవి... టీ సిరీస్, సెట్ ఇండియా, జీటీవీ, చుచుటీవీ, వేవ్ మ్యూజిక్, సబ్ టీవీ, జీ మ్యూజిక్, సీవీస్ రైమ్స్, స్పీడ్ రికార్డ్స్, ఈరోస్ నౌ ఉన్నాయి.
అలాగే ఫేస్బుక్ వార్తా ఛానెళ్లలో.. టాప్-10లో ఉన్నవి.. ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, ఆజ్తక్, విజయ్ టెలివిజన్, ఏబీపీ మఝా, ఏబీపీ లైవ్, హెబ్బార్స్ కిచెన్, ది అమిత్ భదానా, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆష్కీన్-1 ఉన్నాయి.