సిడ్నీ హత్య: నెలలో వస్తానని తిరిగి రాని లోకాలకు వెళ్లిన టెక్కీ ప్రభ
బెంగళూరు: కుమార్తెను బాగా చదివించాలని, డబ్బు సంపాదించడానికి ఆస్ట్రేలియా వెళ్లిన సాఫ్టువేర్ ఇంజనీర్ ప్రభ ఒక నెలలో బెంగళూరు తిరిగి వస్తున్న సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చంద్రాలేఔట్లోని సోంత ఇంటి దగ్గర, దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ సమీపంలోని అమ్దూరు గ్రామంలో ( ప్రభ పుట్టిన ఊరు)లో విషాదచాయలు నెలకొన్నాయి.
ఆమ్దూరు గ్రామానికి చెందిన మహాబల శెట్టి, సరోజిని శెట్టి కుమార్తె ప్రభ, బెంగళూరులోని చంద్రాలేఔట్లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ల వివాహం 13 సంవత్సరాల క్రితం జరిగింది. వీరికి మేఘనా (10) అనే కుమార్తె ఉంది.
మైండ్ ట్రీ కన్సల్టెన్సీలో గత 8 సంవత్సరాల నుండి ప్రభ సీనియర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. 2012వ సంవత్సరంలో ఒక ప్రాజెక్ట్ కోసం ప్రభను ఆస్ట్రేలియా పంపించడానికి కంపెనీ ప్రతినిధులు సిద్దం అయ్యారు. ప్రభ అన్న శంకర్ శెట్టి ఆస్ట్రేలియాలోని పర్ద్ నగరంలో వైద్యుడిగా ఉద్యోగం చేస్తున్నాడు.
తన సోదరుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో ప్రభ అక్కడికి వెళ్లి ప్రాజక్ట్ పూర్తి చెయ్యడానికి అంగీకరించింది. 2012లో ప్రభ ఆస్ట్రేలియా వెళ్లారు. ప్రాజక్ట్ పూర్తైన తర్వాత రెండు సంవత్సరాలు పొడిగించారు. ఈ మూడు సంవత్సరాలలో ప్రభ ఒక్కసారి బెంగళూరు వచ్చారు. ఆమె భర్త అరుణ్ కుమార్ ఒక్కసారి ఆస్ట్రేలియా వెళ్లి భార్యను చూసి వచ్చారు. మేఘనా బెంగళూరులో తండ్రితో కలిసి నివాసం ఉంటోంది.
ప్రతి రోజు భర్త, కుమర్తెకు ఫోన్ చేసి మాట్లాడటం ప్రభకు ఆనవాయితీ. నాలుగు రోజు క్రితం తల్లిదండ్రులకు ప్రభ పోన్ చేశారు. మార్చి నెలాఖరుకు ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని, ఏఫ్రిల్ మొదటి వారంలో బెంగళూరు వచ్చేస్తానని చెప్పింది. ఈసారి ప్రాజెక్ట్ పొడగించినా తాను అంగీకరించని తేల్చి చెప్పింది.
బెంగళూరు చేరుకుని భర్త, కుమర్తెతో కలిసి జీవిస్తానని చెప్పింది. అయితే ఒక నెలలో బెంగళూరు రావలసిన ప్రభ దుండగుల చేతిలో అంతంకావడతో వారి కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. తల్లి హత్యకు గురి అయ్యిందని తెలియని మేఘనా ఎప్పటిలాగే సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నది. ప్రభ భర్త అరుణ్ కుమార్, ఆమె సోదరుడు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు.
ప్రభను ప్రతి రోజు సాటి ఉద్యోగులు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లేవారు. అయితే శనివారం రాత్రి ప్రభ ఒక్కరే నడిచి వెళుతున్న సమయంలో దుండగుడు కత్తితో దాడి చేసి హత్య చేసి పరారైనాడు.