మైనార్టీలకు నష్టం లేదు, శరణార్థుల హక్కుల కోసమే, క్యాబ్ బిల్లుపై రాజ్యసభలో అమిత్ షా
పౌరసత్వ సవరణ బిల్లుతో మైనార్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సవరణ బిల్లు శరణార్ధుల హక్కుల కోసం రూపొందించిందని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భయాందోళనతో ఉన్న కోట్లాది మందికి సవరణ బిల్లు మేలు చేస్తుందని తెలిపారు. మధ్యాహ్నాం 12 గంటలకు రాజ్యసభలో అమిత్ షా పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
శరణార్థులకు మేలు
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలో ఉన్న కోట్లాదిమంది శరణార్థులకు మేలు జరుగుతుందని అమిత్ షా చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. దేశంలోని ముస్లింలు ఆందోళనకు గురికావొద్దన్నారు. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రమే పౌరసత్వం ఇవ్వబోమని చెప్పారు. ఇతరదేశాల ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాలని మీరు భావిస్తున్నారా అని ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా..
పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాలకే కాదు యావత్ దేశవ్యాప్తంగా వర్తిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. సవరణ బిల్లుకు ప్రజలు కూడా మద్దతు తెలిపారని చెప్పారు. దేశంలో ఏళ్ల నుంచి వివక్షకు గురవుతున్న శరణార్థులు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దేశంలో ఉన్న మైనార్టీల పాలిట వరం సవరణ బిల్లు అని పేర్కొన్నారు. సవరణ బిల్లుతో న్యాయపరంగా సమస్య రాదని అమిత్ షా తెలిపారు.
చట్ట వ్యతిరేకం కాదు
ఇది చారిత్మాత్మక బిల్లు అని, చట్ట వ్యతిరేకం కాదు అని అభిప్రాయపడ్డారు. ఐద ఐక్యతను విశ్వసిస్తున్నామని.. ప్రజల హక్కులను కాపాడుతామన్నారు. బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని, సందేహాలను నివృత్తి చేస్తామని అమిత్ షా చెప్పారు. కానీ సభ్యులు సభలో ఉండాలని.. వాకౌట్ చేయొద్దని అమిత్ షా కోరారు. అమిత్ షా ప్రసంగం తర్వాత విపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తర్వాత బిల్లు ఓటింగ్ నిర్వహిస్తారు.