ముస్లింలకు బిల్లు వ్యతిరేకం కాదు: మోదీ ప్రభుత్వంలో వారికి అభయం : అమిత్షా హామీ..!
బీజేపీ వ్యూహాలతో ఎట్టకేలకు లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటాక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ పొందింది. మద్దతు కోసం చక్రం తిప్పిన బీజేపీ సక్సెస్ అయింది. మహారాష్ట్రలో బీజేపీతో విభేదించిన శివసేన మాటల్లో నిరసించి చేతల్లో మద్దతిచ్చింది. దాదాపు పది గంటల పాటు సభలో వాడివేడిగా చర్చ సాగింది. మతంతో దేశాన్ని చీల్చింది కాంగ్రెస్సే అని..భారత ముస్లింలకు బిల్లు వ్యతిరేకం కాదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. బిల్లు ఆమోదం పొందటంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేసారు. అమిత్ షాను అభినందించారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు.
బీజేపీతో సీఎం జగన్ రివర్స్ గేమ్: ఏపీలో ఇలా..ఢిల్లీలో అలా : పవన్ కళ్యాణ్ కేంద్రంగా..!
అనుకూలం 311...వ్యతిరేకం 80 మంది
లోక్ సభలో వాడి వేడిగా సాగిన పౌరసత్వ సవరణ బిల్లుకు అర్ద్రరాత్రి దాటిన తరువాత ఓటింగ్ జరిగింది. దాదాపు పది గంటలపాటు తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణల అనంతరం వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సభ రాత్రి ఆమోదించింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు.. బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకే, అసోం గణపరిషత్, శిరోమణి అకాలీదళ్తో పాటు ఈ మధ్యే దూరమైన శివసేన కూడా అనుకూలంగా ఓటు వేయడం విశేషం. చర్చ సమయంలో బిల్లును విభేదిస్తున్నట్లుగా మాట్లాడిన శివసేన ఓటంగ్ సమయంలో తన వైఖరి మార్చుకుంది. వైసీపీ, బీజేడీ, టీడీపీ లాంటి తటస్థ పక్షాలు సైతం బాసటగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది.
ముస్లింలకు బిల్లు వ్యతిరేకం కాదు
తాము ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు భారతీయ ముస్లింలకు ఏమా త్రం వ్యతిరేకం కాదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంలో ముస్లింలు భయపడాల్సిన పనిలేదు. ఇన్నేళ్లూ వారు ఎంత గౌరవంగా జీవించారో ఇక ముందూ అంతే గౌరవంతో స్వేచ్ఛగా జీవించవచ్చని అభయమిచ్చారు. ఇదే సమయంలో త్వరలో జాతీయ పౌరుల చిట్టా (ఎన్ఆర్సీ)ను కూడా దేశవ్యాప్తంగా కచ్ఛితంగా అమలు చేస్తాం. ఇందులో సందేహం లేదు. ఎన్ఆర్సీ వస్తోంది.. సిద్ధంగా ఉండండి..అంటూ అమిత్ షా తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే రోహింగ్యా ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇచ్చే ప్రశ్నే లేదు. వారిని వారి దేశాలకు పంపేస్తామని స్పష్టం చేశారు. ఇది నెహ్రూ-లియాకత్ అలీ ఖాన్లు చేసిన తప్పిదాన్ని సవరించడమేనని.. ఈ దేశాన్ని మతపరంగా విభజించడానికి నాటి వారి ఒప్పందమే ప్రాతిపదక అయ్యిందన్నారు. నాడు నెహ్రూ చేసిన తప్పును మోదీ సవరిస్తున్నారని సభకు వివరించారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంని అని బీజేపీ సభ్యుల హర్షధ్వానాల మధ్య షా సభలో స్పష్టం చేసారు.
వారు గౌరవంగా జీవించేందుకు అవకాశం
బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో శరణార్థులు వేరు.. చొరబాటుదారులు వేరుని షా స్పష్టం చేసారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరులు వేలల్లో ఉన్నారు. వారికి న్యాయం జరగాలన్నారు. వారు భారత్కు కాక మరెక్కడికి పోతారని ప్రశ్నించారు. ఈ మూడు దేశాలే ఎందుకంటే... ఇవి మనకు అతి సమీపంగా, దాదాపు కలిసిపోయినట్లుగా ఉన్న సరిహద్దులు గలవని ..అంతకుమించి ఇవి మూడూ ఇస్లామిక్ దేశాలని చెప్పుకొచ్చారు. అక్కడ ముస్లింలకూ ఎటూ రక్షణ ఉంటుంది... మిగిలిన మతస్థులు ద్వితీయశ్రేణి పౌరులు. అందుకే హిందూ, క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్శీ, సిక్కు మతస్థులకు పౌరసత్వం కల్పించాలని నిశ్చయించామని వివరించారు. దేశంలో ముస్లింల జనాభా 1951లో 9.8% ఉంటే 2011లో 14.5%కు పెరిగింది. హిందువుల జనాభా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 84శాతం నుంచి 79శాతం కు తగ్గిందని వివరించారు. పాకిస్థాన్లో మైనారిటీల జనాభా 23% నుంచి 3.7%కు, బంగ్లాదేశ్లో 22% నుంచి 7%కు తగ్గిందని ఆయన లెక్కలతో సహా సభ ముందు తన వాదన వినిపించారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదని... ఏళ్ల తరబడి ఆ మూడు దేశాల్లో బాధలు పడ్డ వారికి ఊరట అంటూ చెప్పుకొచ్చారు. వారు గౌరవంగా జీవించేందుకు ఓ అవకాశం అని అమిత్ షా తేల్చి చెప్పారు.