బాలాకోట్ దాడుల తర్వాత మాయమైన పాక్ జలాంతర్గామి..భారత్ ఏమి చేసిందో తెలుసా..?
పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ నేవీ తన యుద్ధ నౌకలను, అణ్వాయుధాలను, జలాంతర్గాములను పాకిస్తాన్ జలాలకు అత్యంత సమీపంలో ఉంచిందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. నేవీలో ఉన్న అన్ని రక్షణ అస్త్రాలను పాక్ జలాలకు సమీపంలో ఉంచినట్లు సమాచారం. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి పాక్ కారణమని భారత్ భావించిన నేపథ్యంలో భారత్ కచ్చితంగా సముద్రమార్గం ద్వారా దాడులు చేసే అవకాశం ఉందని పాక్ పసిగట్టినట్లు తెలుస్తోంది.
పాక్ జలాల నుంచి మాయమైన పీఎన్ఎస్ సాద్
బాలాకోట్లో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత భారత్ సముద్ర మార్గం ద్వారా కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన జలాంతర్గామి పీఎన్ఎస్ సాద్ పాక్ జలాల నుంచి మాయమైనట్లు భారత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మిగతా యుద్ధ నౌకలతో పోలిస్తే పీఎన్ఎస్ సాద్లో అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇది కనిపించకపోవడంతో భారత్ జలాల్లోకి ప్రవేశించి ఉంటుందన్న అనుమానం భారత నేవీకి వచ్చింది.
భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిందా..?
పీఎన్ఎస్ సాద్ జలాంతర్గామి కరాచీలో మాయమవడంతో గుజరాత్ తీరానికి చేరేందుకు మూడురోజుల సమయం పడుతుంది. ముంబైకి తీరానికి చేరేందుకు ఐదురోజుల సమయం పడుతుందని అంచనా.ఒక వేళ అదికనుక చేరిఉండి ఉంటే దేశ భద్రతకు భారీ నష్టం వాటిల్లేదని అధికారులు అంచనా వేశారు. ఇక పీఎన్ఎస్ సాద్ కోసం భారత నేవీ వేట సాగించింది. జలాంతర్గాములను గుర్తించే అధునాతన యుద్ధనౌకలను భారత నేవీ రంగంలోకి దించింది. పాక్ జలాంతర్గామి తక్కువ సమయంలో ఎక్కడికైతే వెళ్లి ఉంటుందో అని అంచనా వేసి ఆ సముద్రజలాలను జల్లెడ పట్టింది.గుజరాత్, మహారాష్ట్ర తీరంతో పాటు ఇతర రాష్ట్ర తీరాలను కూడా జల్లెడ పట్టింది భారత నేవీ. ఐఎన్ఎస్ చక్ర, స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరిలు ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం.అదేసమయంలో భారత సముద్రజలాల్లో ఎలాంటి అలజడి సృష్టించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత్ హెచ్చరించింది.
21 రోజుల పాటు పాక్ జలాంతర్గామి కోసం వేట
ఇక రోజులు గడిచేకొద్దీ పీఎన్ఎస్ సాద్ కోసం వేటను వేగవంతం చేసింది భారత నేవీ. ఇందుకోసం శాటిలైట్ లొకేటర్లను కూడా వినియోగించింది. మరోవైపు పాకిస్తాన్ ఈ అధునాతన జలాంతర్గామిని ఎక్కడైనా దాచేశారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేసింది. అయితే 21 రోజుల నిరంతర సెర్చ్ ఆపరేషన్ తర్వాత పీఎన్ఎస్ సాద్ పాక్ పశ్చిమ తీరంలో కనుగొన్నారు. బాలాకోట్లో భారత్ దాడులు జరిపిన తర్వాత పీఎన్ఎస్ సాద్ జలాంతర్గామిని కూడా ధ్వంసం చేస్తారేమో అన్న అనుమానంతో పాక్ పీఎన్ఎస్ సాద్ ను అక్కడ దాచినట్లు సమాచారం. అరేబియన్ సముద్రంలో నేవీ పూర్తిస్థాయి నిఘా ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు పాకిస్తాన్ నేవీకి సంబంధించిన సమాచారం కూడా భారత్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేస్తుందన్న అనుమానం రావడంతో ఆ దేశం తమ అత్యంత విలువైన యుద్ధనౌకలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మక్రాన్ తీరంలో ఉంచారని భారత నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ ఒకనొక సమయంలో చెప్పారు.