భారత నేవీ ఐదో క్లాస్ సబ్మెరైన్ వాగిర్ జల ప్రవేశం
ముంబై: భారత నావికా దళంలోకి అస్త్రం చేరింది. గురువారం స్కార్పీన్ క్లాస్ 'వాగిర్' జలాంతర్గామి మజగావ్ డాక్ వద్ద అరేబియా సముద్ర జలాల్లో జలప్రవేశం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, దేశంలో నిర్మిస్తున్న ఆరు కల్వారీ క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ వాగిర్ ఐదోది. ఫ్రెంచ్ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ఎస్ రూపొందించిన జలాంతర్గాములను భారత నావికాదళం ప్రాజెక్టు-75లో భాగంగా ముంబైలోని మజగావ్ డాక్ లిమిటెడ్(ఎండిఎల్) నిర్మిస్తోంది.
ఆరు స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరిని 2017 డిసెంబర్లో భారత నావికాదలంలోకి ప్రవేశపెట్టారు. ఇది డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. ఐఎన్ఎస్ ఖండేరి రెండవది కాగా, మూడోది ఐఎన్ఎస్ కరంజ్(2018), నాల్గోది ఐఎన్ఎస్ వెలా(2019), స్కార్పీన్ జలాంతర్గాములు అనేక రకాలైన మిషన్లలో పాల్గొననున్నాయి. యాంటీ-సర్ఫెస్ వార్ ఫేర్, యాంట్ సబ్మెరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్, తీర ప్రాంతాల్లో నిఘా తదితర ఆపరేషన్లు చేపట్టనున్నాయి.
వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆర్ బి పండిట్ ఐఎన్ఎస్ వాగిర్ ప్రయోగంపై వ్యాఖ్యానిస్తూ.. ఏడాది వ్యవధిలో సబ్మెరైన్ ప్రారంభమవుతుందని తాను ఊహించానని చెప్పారు.
'నేవీలో ఇప్పటికే రెండు కల్వారీ-క్లాస్ జలాంతర్గాములు పనిచేస్తున్నాయి. మిగితా నాలుగు చాలా త్వరగా అందుకున్నందుకు మేము సంతోషిస్తాము' అని వైస్ అడ్మిరల్ ఆర్ బి పండిట్ అన్నారు. ఆరవ స్కార్పీన్ జలాంతర్గామి 'వాగ్షీర్' వివిధ దశల్లో ఉంది. కాగా, దేశం ప్రగతిశీల స్వదేశీ యుద్ధనౌక నిర్మాణ కార్యక్రమంలో ఎండిఎల్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంది.