లడాఖ్కు మిగ్-29కే, పీ-81 విమానాలు, ఉద్రిక్త నేపథ్యంలో తరలింపు..
లడాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. బలగాలను ఉపసంహరించామని చైనా చెబుతోన్న.. డ్రాగన్ మాటలను భారత్ విశ్వసించడం లేదు. నేవీ అధీనంలో గల మిగ్-29కే, పోసిడాన్-81 విమానాలను లడాఖ్లో మోహరించింది. మిగ్-29కే సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ కాగా, పీ-81 లాంగ్ రేంజ్ గస్తీ విమానం. భారత ప్రాదేశిక సముద్రజలాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే పీ-81 వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఇది అందించే సమాచారంతో దాడులు చేయడానికి భారత నేవీ మిగ్-29కేను ఉపయోగిస్తుంది.
సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలపై కన్నేయడానికి వీటిని రంగంలోకి దించారు. ఎన్నో ఉపగ్రహాలు, డ్రోన్లు నిఘా పనుల్లో నిమగ్నమైనా, వాటికి అదనంగా పీ-81లను మోహరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. విమానంలో అధికభాగం రాడార్ యంత్రాంగం, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్ వ్యవస్థలే ఉంటాయి. శత్రుదేశాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఎక్కడున్నా వెతికి, వెంటాటడమే వీటి పని.
సరిహద్దు విధుల్లో సుఖోయ్-30ఎంకేఐ, మిరేజ్-2000, మిగ్-29 వంటి పోరాట విమానాలు ఉన్నా, నేవీకి చెందిన మిగ్-29కేల సేవలను కూడా ఉపయోగించుకోవాలని వాయుసేన భావిస్తోంది. అపాచీ పోరాట హెలికాప్టర్, చినూక్ వంటి భారీ రవాణా హెలికాప్టర్లు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాయి. మలక్కా జలసంధి గుండా చైనా సాగించే వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు భారత్ 10 వరకు జాగ్వార్ సముద్ర పోరాట విమానాలను సిద్ధంగా ఉంచింది. వీటికి నౌకలను తుత్తునియలు చేసే హార్పూన్ మిసైళ్లు అమర్చి ఉంటాయి.