భారతీయ విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఆస్ట్రేలియాకు ఇక ఈజీగా...
ఆస్ట్రేలియా తీసుకున్న తాజా చర్యలతో ఆ దేశంలోని మరిన్ని విద్యా సంస్థల్లో చేరే అవకాశం భారతీయ విద్యార్థులకు లభించనుంది. అంతేకాకుండా స్టూడెంట్ వీసా పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్య కూడా తగ్గుతుంది.
న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పలు ఆకర్షణీయ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మన దేశానికి ఉన్న 'హై రిస్క్' అసెస్మెంట్ ను 'మోడరేట్ రిస్క్' కేటగిరీకి మార్చింది.
దీంతో మరిన్ని ఆస్ట్రేలియా విద్యా సంస్థల్లో చేరే అవకాశం భారతీయ విద్యార్థులకు లభించనుంది. అంతేకాకుండా స్టూడెంట్ వీసా పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్య కూడా తగ్గుతుంది.
ఆస్ట్రేలియాలోని వర్సిటీలకు నాణ్యత ప్రాతిపదికన ర్యాంకింగ్ ఉంటుంది. దేశానికి ఇచ్చిన కేటగిరీ సంఖ్యను దరఖాస్తు చేసుకున్న వర్సిటీకి అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం మన దేశానికి ఇచ్చిన కేటగిరీతో భారత విద్యార్థులు ఎక్కువ వర్సిటీలను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయి.
2025 నాటికి 7,20,000 మంది అంతర్జాతీయ విద్యార్థులను తమ వర్సిటీల్లో చేరేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అమెరికా, బ్రిటన్ తర్వాత ఆస్ట్రేలియాలోనే అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కువగా ఉంటాయి.
స్టూడెంట్ వీసాల మంజూరుకు సంబంధించి వివిధ దేశాలను రిస్క్ ప్రాతిపదిక నాలుగు కేటగిరీలుగా ఆస్ట్రేలియా విభజించింది. కేటగిరీని బట్టి డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది. ఉదాహరణకు హైరిస్క్ అసెస్మెంట్ కేటగిరీ కింద ఉన్న దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్ వీసా పొందేందుకు ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
భారత్ ఇప్పటి వరకు హైరిస్క్ విభాగంలో ఉండేది. దీంతో ఆస్ట్రేలియాలోని ఎక్కువ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను ఎంపిక చేసుకునే ఆప్షన్లు మన విద్యార్థులకు తక్కువగా ఉండేవి.
ఆస్ట్రేలియన్ ఎంబసీ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను ఇప్పుడు తగ్గించింది. అయితే సదరు దరఖాస్తుదారుడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డాక్యుమెంట్లను అడిగే అధికారం వీసా అధికారికి ఉంటుంది.