అమెరికాలో 9 మందిని కాల్చిన ఇండియన్ లాయర్, కాల్చివేత
న్యూయార్క్: భారత సంతతి లాయర్ ఒకతను అమెరికాలో తొమ్మిది మంది పైన కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతను పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. అతని పేరు నాథన్ దేశాయ్. వ్యక్తిగత సమస్యల వల్ల నాథన్ దేశాయ్ న్యూయార్క్లో రోడ్డుపై కనిపించిన తొమ్మిది మందిని కాల్చేశాడు.
నాథన్ దేశాయ్ సోమవారం ఉదయం మిలటరీ డ్రెస్ వేసుకుని తుపాకీతో దాదాపు ఇరవై నిమిషాల పాటు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో నాథన్ దేశాయ్ అక్కడికక్కడే మరణించాడు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతడు ఈ కాల్పులు జరిపినట్లు అర్థమవుతోందని హ్యూస్టన్ పోలీస్ చీఫ్ తెలిపారు. వృత్తిలో ఏర్పడిన సమస్యల మూలంగా ఒత్తిడికి లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో అతడి తండ్ర తెలిపారన్నారు. ఓ భారతీయుడు అమెరికాలో కాల్పులు జరపడం ఇది రెండో సారి అని వెల్లడించారు.
ఈ ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినంటూ లీ విలియమ్స్ అనే వ్యక్తి వీడియోను బయటపెట్టాడు. కాల్పుల సమయంలో నాథన్ దేశాయ్ స్వస్తిక్ గుర్తు ఉన్న మిలటరీ యూనిఫాం ధరించి ఉన్నాడని, రెండు తుపాకులు, 2600 రౌండ్లు కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అలాగే అతని కారులోని నోట్బుక్లో ఓ స్వస్తిక్ గుర్తు, నాజీ ఎంబ్లమ్లు, వింటేజ్ మిలటరీ వస్తువులు, గన్స్ లభ్యమయ్యాన్నారు. దేశాయ్ చాలా మంచి వ్యక్తి అని, అతని వద్ద నాజీ మెటీరియల్ ఉన్నట్టు తమకు తెలియదని అతడి స్నేహితులు తెలిపారు. కాగా, గత రెండు నెలలుగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటున్నారు.
హారిస్ కౌంటీ కోర్టు రికార్డుల ప్రకారం దేశాయ్ కొన్నేళ్లుగా కేసులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2013లో రెండంటే రెండు క్రిమినల్ కేసులు మాత్రమే అతని వద్ద ఉన్నాయి. ఈ ఫిబ్రవరిలో అతడి భాగస్వామి విడిపోయాడు. ఆర్థిక కారణాలతో ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని భాగస్వామి తెలిపారు.