రైల్వే నిర్ణయం: 4 లక్షల చెట్లు, 319 కోట్ల పేపర్లు ఆదా
ఈ ఏడాది భారతీయ రైల్వే పోటీ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల దాదాపు నాలుగు లక్షల చెట్లు, 319కోట్ల ఏ4 సైజు పేపర్లు ఆదా అయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతీయ రైల్వే పోటీ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల దాదాపు నాలుగు లక్షల చెట్లు, 319కోట్ల ఏ4 సైజు పేపర్లు ఆదా అయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే ప్రశ్నా పత్రాలకు చెక్ చెప్పి, ఆన్ లైన్ విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఫలితంగా 319 కోట్ల ఏ4 పేపర్ల వాడకం తగ్గింది. లేదంటే ఈ మొత్తం కోసం ఏకంగా 4 లక్షల చెట్లను నరకాల్సి వచ్చేది.
పేపర్లను వదిలేసిన రైల్వే మూడు దశల్లో ప్రిలిమినరీ, రిటన్, ఆప్టిట్యూడ్లో ఆన్ లైన్ టెస్ట్ నిర్వహించింది. ఇలా ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించడం రైల్వేకు ఇదే తొలిసారి.
రైల్వే శాఖ ప్రకటించిన 14వేల ఖాళీల భర్తీకి ఈ ఏడాది జనవరిలో మూడు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 351 కేంద్రాల్లో దాదాపు 92 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ పరీక్షను నిర్వహించి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. జనవరి 17-19న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించగా, చివరి పరీక్ష సైకాలజికల్, టైపింగ్ నైపుణ్య పరీక్షను గత నెల 29, 30 తేదీల్లో నిర్వహించినట్లు తెలిపారు.
మాస్ కాపీయింగ్, పేపరు లీకేజీ సమస్యలను అధిగమించేందుకు రైల్వే శాఖ ఆన్ లైన్ పరీక్షను నిర్వహించింది. రాతపూర్వక పరీక్షకు ఎక్కువ ఖర్చు అవుతోంది.
ఆన్ లైన్ విధానం ద్వారా ఆ ఖర్చు తగ్గుముఖం పట్టింది. అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరులో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి దీపావళి పండుగ లోపు విధుల్లో చేరేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.