ప్రయాణికులకు శుభవార్త: రైల్వే, విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ ఆరంభం: జర్నీ ఎప్పట్నుంచంటే..!
న్యూఢిల్లీ: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో లక్షలాది మంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేని స్థితికి చేరుకున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో వేలాదిమంది వలస కార్మికులు కాలి నడకన తమ గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.
ప్రాథేయ పడుతోన్న మర్కజ్ చీఫ్ మౌలానా: ఆడియో టేప్..సెల్ఫ్ క్వారంటైన్: వారికి కీలక సందేశం
ప్రయాణికులకు శుభవార్త..
ఈ పరిస్థితుల్లో రైల్వే, ప్రైవేటు విమానయాన సంస్థలు శుభవార్తను వెల్లడించాయి. రైల్వే, విమాన ప్రయాణాల కోసం ముందస్తు టికెట్ల బుకింగ్ను ఆరంభించాయి. గురువారం ఉదయం టికెట్ల రిజర్వేషన్లను చేపట్టాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రయాణం సాగించడానికి వీలుగా ఆన్లైన్ల ద్వారా టికెట్లను జారీ చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తోంటే.. ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా రైళ్లన్నీ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విమానాల రాకపోకలు ఆరంభమౌతాయనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ప్రస్తానికి దేశీయ విమాన ప్రయాణాలకే అనుమతి ఉంది.
లాక్డౌన్ పొడిగించే అవకాశాలు లేవంటూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ముగియబోతోన్న విషయం తెలిసిందే. లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు గానీ, అలాంటి ప్రణాళిక గానీ ప్రస్తుతానికి తమ వద్ద ఏదీ లేదంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించారు. లాక్డౌన్ను పొడిగిస్తారంటూ వస్తోన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలాంటి వార్లన్నీ నిరాధారమైనవేనని, వాటిని నమ్మొద్దని సూచించారు. లాక్డౌన్ పొడిగించట్లేదంటూ ఒకరకంగా రాజీవ్ గౌబా కుండబద్దలు కొట్టినట్టయింది.
Recommended Video
కేంద్రం నుంచి ఆదేశాలు..
దేశవ్యాప్తంగా రైల్వేలు, ప్రైవేటు విమానయాన సంస్థల్లో ప్రయాణించడానికి వీలుగా టికెట్ల బుకింగ్ను చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు వేర్వేరుగా ఓ సర్కులర్ను పంపించినట్లు చెబుతున్నారు. దీనితో- ఈ రెండు శాఖలు టికెట్ల బుకింగ్ను ఆరంభించాయి. లాక్డౌన్ తేదీలను పొడిగించాల్సిన పరిస్థితే ఏర్పడితే టికెట్ల ఛార్జీని ప్రయాణికులకు వెనక్కి ఇచ్చేస్తామని అధికారులు వెల్లడించారు.