రైల్వేల్లో పెనుమార్పులు- మరింత సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణం- 20 కొత్త సౌకర్యాలు...
ప్రపంచవ్యాప్తంగా దేశదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ సంక్షోభం భారత్ పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారికి ప్రభావితం కాని రంగమంటూ లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజా రవాణాను పునరుద్ధరించినా ప్రయాణికుల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంటోంది. దీంతో మారిన పరిస్ధితుల్లో ప్రయాణికులను ఆకట్టుకోవడం కోసం మరిన్ని అధునాతన సౌకర్యాలతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వేలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జోన్లలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న పలు సౌకర్యాలతో పాటు కొత్త వాటిని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది.
Recommended Video
గుడ్న్యూస్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం, వ్యాక్సిన్ అభివృద్ధికి రష్యా ప్లాన్
రైలు ప్రయాణాలపై కరోనా ప్రభావం..
ఒకప్పుడు రోడ్డు ప్రయాణాలతో పోలిస్తే చౌకగా, సౌకర్యవంతంగా ఉండే రైలు ప్రయాణాన్ని ప్రయాణికులు కోరుకునే వారు. తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు సైతం ప్రయాణించే వీలు ఉండటంతో జనం రైళ్లనే ఎక్కువగా ఆశ్రయించే వారు. కొత్త రైలు మార్గాలకు కూడా భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్ధితి తలకిందులైంది. కరోనా భయాలు మొదలయ్యాక రైలు ప్రయాణాలకు కూడా జనం ఇష్టపడటం లేదు. దీంతో ఒకప్పుడు తమకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వేశాఖ ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతోంది. రైళ్లను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చడం ద్వారా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా తాజాగా రైల్వే కొన్ని కీలక మార్పులతో ముందుకొచ్చింది.
ఉద్యోగుల సూచనతో...
కరోనా తర్వాత రైలు ప్రయాణాలకు ఆదరణ తగ్గడంతో తిరిగి దాన్ని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వేశాఖ దృష్టిసారించింది. ఇందుకోసం తమ ఉద్యోగుల నుంచే ముందుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. ఇందులో రైల్వే ప్రయాణాలకు ఆదరణ కల్పించేందుకు వీలుగా ఉద్యోగులు దాదాపు 2645 సలహాలు ఇచ్చారు. వీటిలో ఆచరణ యోగ్యమైన వాటిని అమలు చేయడం ద్వారా తిరిగి రైల్వేలకు పునర్ వైభవం కల్పించవచ్చని వారు సూచించారు. వీటిలో ఆచరణ యోగ్యమైన, తక్షణం అమలు చేయదగిన 20 సలహాలను రైల్వేశాఖ తాజాగా ఆమోదించింది.
20 కొత్త సౌకర్యాలతో...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని జోన్లలో నడుపుతున్న రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం కొన్ని సౌకర్యాలు, సుఖవంతమైన ప్రయాణం కోసం మరికొన్ని సౌకర్యాలను స్ధానికంగా అధికారులు కల్పిస్తున్నారు. ఇవన్నీ విజయవంతం కావడంతో ఆయా చోట్ల రైల్వే సర్వీసులకు మంచి ఆదరణ కూడా ఉంటోంది. దీంతో ఇప్పుడు వీటిని దేశవ్యాప్తంగా విస్తరించాలని రైల్వేబోర్డు తాజాగా నిర్ణయించింది. వీటిలో సీసీ టీవీ కెమెరాలు, ప్యూరిఫైడ్ వాటర్, మొబైల్ యాప్ లో అన్ రిజర్వుడ్ టికెట్ల బుకింగ్, రైలు బయలుదేరే రెండు నిమిషాల మందు వార్నింగ్ బెల్స్, పోలీసు భద్రత పెంపు, ఫుడ్ డెలివరీ మార్పులు వంటి అంశాలున్నాయి. వీటిని అమలు చేయడం ద్వారా కొంతమేర అయినా ట్రాపిక్ ను తిరిగి ఆకర్షించగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని రైల్వేబోర్డు భావిస్తోంది.