టిక్కెట్ల క్యాన్సిలేషన్ ద్వారా రైల్వేకు రూ.1407 కోట్ల ఆదాయం
రిజర్వ్డ్ టిక్కెట్ల రద్దు ద్వారా భారతీయ రైల్వేకు రూ.1407 కోట్ల ఆదాయం వచ్చింది.2016-2017 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ ఆదాయం ఆర్జించింది.సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) ఈ విషయా
ఇండోర్: రిజర్వ్డ్ టిక్కెట్ల క్యాన్సిలేషన్ ద్వారా భారతీయ రైల్వేకు రూ.1407 కోట్ల ఆదాయం వచ్చింది. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ ఆదాయం ఆర్జించింది.
సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది కంటే ఇది 25.29 శాతం అధికమని తెలిపింది.
సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన సమాచారం మేరకు సీఆర్ఐఎస్ ఈ వివరాలను వెల్లడించింది. గౌడ్కు ఇచ్చిన సమాధానంలో టిక్కెట్ క్యాన్సిలేషన్ ద్వారా 14.07 బిలియన్ ఆదాయం పొందినట్లు తెలిపంది.
అంతేకాకుండా 2015-16 సంవత్సరంలో ఇది రూ.11.23 బిలియన్లుగా ఉన్నట్లు తెలిపింది. 2014-15లో ఇది రూ.9.38 బిలియన్లుగా ఉందని తెలిపింది. ఈ సమాచారం అంతా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కింద తనకు అందిందని గౌడ్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
కేవలం రిజర్వ్ చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్ ద్వారా మాత్రమే కాకుండా, రిజర్వ్ కాని టిక్కెట్ల క్యాన్సిలేషన్తోను రైల్వే బాగానే ఆదాయం ఆర్జిస్తోంది. అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) ద్వారా 2016-17లో రూ.17.87 కోట్లను పొందింది.
ఈ మొత్తం 2015-16లో రూ.17.23 కోట్లు, 2014-15లో రూ.14.72 కోట్లుగా ఉంది. రైల్వే ప్యాసెంజర్ నిబంధనలు 2015 కింద అదే ఏడాది నవంబర్ నెలలో క్యాన్సిలేషన్ టిక్కెట్ల మొత్తాన్ని రీఫండ్ చేసే నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చారు.
క్యాన్సిలేషన్ ఫీజులను రెండుసార్లు పెంచారు. ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే, రీఫండ్ రూల్స్ మార్చాలని గౌడ్ కోరారు.