న్యూ ఇయర్ షాక్: టికెట్ ధరలను పెంచిన ఇండియన్ రైల్వే, పెంపు ఇలా..
న్యూఢిల్లీ: కొత్త ఏడాది ప్రయాణికులకు చేదు వార్తనందించింది భారత రైల్వే. జనవరి 1, 2020 నుంచి రైలు టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచింది. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్కు కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
పెంచిన ఛార్జీలు ఇలా..
మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్కు కిలోమీటర్కు 2 పైసల చొప్పును పెంచింది. ఏసీ చైర్ కార్, ఏసీ 3, 4 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్కు కిలోమీటర్కు 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పెంచిన ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. ఐదేళ్ల నుంచి రైల్వే ఛార్జీలను పెంచని దృష్ట్యా రైలు ఛార్జీలను హేతుబద్ధీకరించామని వెల్లడించింది.
ఐదేళ్ల తర్వాత మరోసారి..
కాగా, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చివరి సారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరుకు రవాణా ఛార్జీలు 6.5శాతం పెరిగాయి. ఛార్జీల పెంపుతోపాటు రైళ్లలో ప్రయాణికుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పౌరసత్వ నిరసనల్లో రైల్వేకు భారీ నష్టం..
ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రైల్వే శాఖకు భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లకు, రైళ్లకు నిప్పుపెట్టడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రైల్వేకు భారీ నష్టం జరిగింది. ఆందోళనకారులు ఐదు రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టడంతోపాటు ఓ రైలును మొత్తం తగలబెట్టారు. ఈ విధ్వంసం కారణంగా రైల్వేకు రూ. 88కోట్ల ఆస్తి నష్టం జరిగిందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ నష్టాన్ని విధ్వంసానికి పాల్పడిన వారి నుంచే వసూలు చేస్తామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ ఇటీవల చెప్పారు.