రైల్వే ప్రయాణికులకు ఇక ఆ అసౌకర్యం ఉండదు... ఆ సీట్లలో మార్పులు...
రైలు ప్రయాణంలో స్లీపింగ్ క్లాసులో సైడ్ లోయర్ బెర్త్ సీటు ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆ సీటు స్లీపింగ్కి అంత అనువుగా ఉండదు. ఎదురెదురు సీట్లను ఒక దగ్గరికి చేర్చినప్పుడు.. వాటి మధ్య ఉండే కొంత గ్యాప్ ఆ అసౌకర్యానికి కారణమని చెప్పాలి. రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఈ అసౌకర్యానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు త్వరలోనే కొత్త డిజైన్తో లోయర్ బెర్త్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
'ప్రయాణికులకు ఇండియన్ రైల్వే సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. లోయర్ బెర్త్ సీట్లలో చేసిన కొన్ని మార్పులు ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి.'అని గోయల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
గోయల్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ రైల్వే అధికారి కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్న సైడ్ లోయర్ బెర్త్ సీట్ల డిజైన్ గురించి వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సైడ్ లోయర్ బెర్త్ సీట్లు స్లీపింగ్కి అనువుగా ఉండేలా... వాటిపై మరో పొడవాటి సీటు(బెడ్ మాదిరి ఉండే సీటు)ను ఉంచనున్నారు. తద్వారా రెండు సీట్ల మధ్య ఉండే గ్యాప్ ఆ పొడవాటి సీటుతో కవర్ కానుంది. అప్గ్రేడ్ చేయబడిన ఈ స్లీపర్ క్లాస్ లోయర్ బెర్త్ బహుశా ఏసీ 3-టైర్లో అందుబాటులోకి రానుంది. అప్గ్రేడ్ చేసిన లోయర్ బెర్త్లతో మొదట 230 కోచ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
यात्रियों के सुविधाजनक सफर के लिए प्रयासरत भारतीय रेल, इसी का उदाहरण है सीटों में किये गये कुछ बदलाव, जिनसे यात्रियों का सफर हुआ और अधिक आरामदायक। pic.twitter.com/Q4rbXXYd7f
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) December 11, 2020
కాగా,ఈ ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్తో దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి అన్ని రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం శ్రామిక్ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 230 శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి.