రైల్వే టికెట్ల బుకింగ్పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం: మరి కొంత సమయం పట్టొచ్చంటూ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకింగ్ను ఆరంభించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల రిజర్వేషన్ను ఆరంభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ.. ప్రయాణపు తేదీ మీద అనిశ్చితి నెలకొని ఉందని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దుష్టమైన ఆదేశాలు అందిన తరువాతే ప్రయాణపు తేదీ ఎప్పుడనేది వెల్లడిస్తామని తెలిపింది. రైళ్లు మళ్లీ పట్టాల మీదికి ఎక్కడాకి మరి కొంత సమయం పడుతుందని, ఎప్పటిలోగా అనేది ఇంకా తెలియరాలేదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ లాక్డౌన్ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ మరుసటి రోజు నుంచి లాక్డౌన్ ఎత్తేయడానికి అవకాశాల ఉన్నాయని, ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే, విమాన ప్రయాణాల కోసం రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్లైన్ల ద్వారా టికెట్ల రిజర్వేషన్ను చేపట్టినట్లు వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎప్పటి నుంచి టికెట్లను జారీ చేయాలనే విషయంపై అనిశ్చితి నెలకొందని, లాక్డౌన్ ముగిసిన తరువాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని పేర్కొంది.
Recommended Video
కేంద్ర కేబినెట్ నుంచి అందే ఆదేశాల మీదే రైల్వే టికెట్ల బుకింగ్ ఆధార పడి ఉందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర కేబినెట్ నుంచి నిర్దుష్టమైన ఆదేశాలు అందిన తరువాతే టికెట్లను జారీ చేస్తామని అన్నారు. నిజానికి- తాము టికెట్ల బుకింగ్ను ఆపి వేయలేదని, 120 రోజులకు ముందు ప్రయాణానికి టికెట్లను జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.
లాక్డౌన్ సమయంలో టికెట్లను జారీ చేయట్లేదని తెలిపారు. ప్రయాణపు తేదీ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయంపైనా స్పష్టత రాలేదని తెలిపారు. కేంద్ర కేబినెట్ నుంచి తమకు ఆదేశాలు అందిన వెంటనే.. దానికి అనుగుణంగా తాము పునఃప్రారంభించాల్సిన ప్రయాణపు తేదీని వెల్లడిస్తామని చెప్పారు.